వ్యక్తి దారుణహత్య
మెదక్ (చిన్నకోడూరు) : మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి సామల రంగరాజం(55) అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కొట్టి చంపి ఇంటి వద్ద పడవేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. రంగరాజం నిత్య తాగుబోతు. రోజూ తాగి భార్యాపిల్లలను వేధించేవాడని స్థానికులు చెబుతున్నారు.
గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటే అక్కడే పడవేసేవారని, కానీ.. ఎక్కడో హత్య చేసి ఇంటి వద్ద పడేశారని భార్యాపిల్లలు చెబుతుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.