బంగారు తెలంగాణ కాదు.. బంగారు కుటుంబం!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రస్తుతం కేసీఆర్ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చాలనుకుంటాన్నారే తప్ప.. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేయాలని భావించడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పలు సమస్యలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. పింఛన్ కార్డుల కోసం వితంతువులు, వృద్ధులు, వికలాంగులు గంటల తరబడి క్యూలో నిల్చోని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
సమగ్ర కుటుంబ సర్వే ద్వారా లబ్దిదారుల జాబితా ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల కోసం మళ్లీ దరఖాస్తులు కోరడం ఏమిటని మల్లు ప్రశ్నించారు. ఇది ముమ్మాటీకీ ప్రజలను హింసించడమేనన్నారు. కేసీఆర్ శాడిజంతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు.ఇదిలా ఉండగా ప్రియాంక గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం అనేది ఆమె వ్యక్తిగత విషయన్నారు.ఇప్పటికే ఆమె యూపీలో క్యాంపైనర్ గా ఉన్నారన్నారు.కాంగ్రెస్ కు గెలుపు-ఓటములు సహజమేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.