రామోజీ ఫిలింసిటీలో తెలంగాణ ఉద్యోగులు ఎందరు?

రామోజీ ఫిలింసిటీలో తెలంగాణ ఉద్యోగులు ఎందరు? - Sakshi


హైదరాబాద్:  రామోజీ ఫిలింసిటీలో ఎంతమంది తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఉన్నాయో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ డిమాండ్ చేశారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ... తెలంగాణలో అవినీతి, అక్రమాలు, దోపిడీలు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం అండతోనే సాగుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ విమర్శించారు. దళితుడైన రాజయ్యను బర్తరఫ్ చేయడం కేసీఆర్ దొరతనానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఆచరణ సాధ్యంకాని హామీలతో కేసీఆర్ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు.


మెడికల్ కాలేజీల ఫీజుల విషయంలో రూ.100 కోట్ల అవినీతి ఆరోపణలు వచ్చినా.. సీఎం వాటిపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.రేషన్ కార్డులు, పింఛన్లలో తప్పుడు లెక్కలున్నయంటూ ప్రజలనే దొంగలుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ...మిషన్ కల్వకుంట్ల గా మారిందని ఎద్దేవా చేశారు.  తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్న విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా , వారిపై లాఠీలు ఝుళిపించిన పోలీసులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top