ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య
-
పురుగుమందు తాగి బలవన్మరణం -
మొయినాబాద్ మండలం నాగిరెడ్డిగూడలో ఘటన
మొయినాబాద్, న్యూస్లైన్: ప్రేమ విఫలమైందని మనస్తాపం చెందిన ఓ యువతి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన యువకుడు మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడంతో బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన మొయినాబాద్ మండల పరిధిలోని నాగిరెడ్డిగూడలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై సైదులు కథనం ప్రకారం.. నాగిరెడ్డిగూడకు చెందిన మాజీ సర్పంచ్ జీనుకుంట పెంటయ్య, పోచమ్మ దంపతుల చిన్న కూతురు వరలక్ష్మి(25) ఇంటర్ పూర్తిచేసి ఇంటి వద్ద ఉంటూ టైలరింగ్ చేస్తోంది. అదే గ్రామానికి చెందిన ఎర్ర జంగయ్య కొడుకు రాజు(27), వరలక్ష్మి రెండేళ్లుగా ప్రేమించుకున్నారు.
ఏడాది క్రితం వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో రెండు కుటుంబాలు గొడవపడ్డాయి. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి ఒకరికొకరు మాట్లాడుకోవద్దని ఒప్పందం చేసుకున్నారు. కాగా అప్పటి నుంచి వీరు దూరంగానే ఉంటున్నా ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఇటీవల రాజు కుటుంబసభ్యులు అతనికి మరో అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు. ఆదివారం సాయంత్రం రాజు నిశ్చితార్థం ఉందని తెలుసుకున్న వరలక్ష్మి ఉదయమే అతనికి ఫోన్ చేసింది.
మాట్లాడాలి అని చెప్పడంతో రాజు వరలక్ష్మిని కలిశాడు. తనను ప్రేమించి మరో అమ్మాయితో నిశ్చితార్థం ఎలా చేసుకుంటావని వరలక్ష్మిని అతడిని నిలదీసింది. ‘నువ్వంటే నాకు ఇష్టంలేద’ని రాజు స్పష్టం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగింది. కొద్దిసేపటికి చుట్టుపక్కలవారు గమనించి 108 వాహనంలో వరలక్ష్మిని ఆస్పత్రికి తరలించే యత్నం చేశారు.
మార్గంమధ్యలోనే యువతి మృతిచెందింది. దీంతో మృతదేహాన్ని అదే రాత్రి గ్రామానికి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు నాగిరెడ్డిగూడకు చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి సోమవారం కుటుంబీకులకు అప్పగించారు. యువతి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.