నిద్రిస్తున్న వ్యక్తి పైనుంచి వెళ్లిన లారీ


నుజ్జునుజ్జయిన ఆటో డ్రైవర్ శరీరం

 

 తిమ్మాపూర్ : నిద్రిస్తున్న ఆటోడ్రైవర్ పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన అల్గునూరు పరిధిలోని రాజీవ్ రహదారి పక్కనే ఉన్న భారత్ పెట్రోల్‌బంక్‌లో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా మద్దూరు మండలం డోర్నాల తండకు చెందిన గుగులోతు బోజు(32) కరీంనగర్‌లోని కాశ్మీర్‌గడ్డ వద్ద ఉంటూ ఆటో నడిపి జీవిస్తున్నాడు. భార్య స్వప్న కాశ్మీర్‌గడ్డ మార్కెట్‌లో కూరగాయలు అమ్ముతోంది. బోజు మంగళవారం రాత్రి పెట్రోల్‌బంక్‌లో ఆటోను నిలిపి పక్కనే కింద నిద్రిస్తున్నాడు. అదే బంక్‌లో ముందుగా పార్కింగ్ చేసినున్న లారీని డ్రైవర్ వెనక్కి తీస్తుండగా బోజుపై నుంచి వెళ్లింది.



బంక్ సిబ్బంది అంతా నిద్రలో ఉండడంతో లారీ ఆపకుండా వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం చూసేసరికి ఆటో డ్రైవర్ బోజు శరీరం నుజ్జునుజ్జయి ఉంది. సమాచారం అందించడంతో హెడ్‌కానిస్టేబుల్ బాపు, పోలీసులు మురళి, వినోద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆటో అడ్డాల నుంచి వచ్చిన డ్రైవర్లు మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎల్‌ఎండీ పోలీసులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top