ఇక ఉస్మానియాలో కాలేయ మార్పిడి


సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో కాలేయ మార్పిడి ఆపరేషన్ నిర్వహణకు ప్రభుత్వం అనుమతించింది. అందులో భాగంగా ఇద్దరు రోగుల ఆపరేషన్ ఖర్చును భరించాలని నిర్ణయించింది. వారికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. వారిద్దరికి త్వరలో కాలేయ మార్పిడి ఆపరేషన్ చేసేందుకు ఉస్మానియా వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల్లో కంటే తక్కువ ఖర్చుతో కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయొచ్చని ఉస్మానియా వైద్యులు ఇటీవల ప్రభుత్వానికి నివేదించడం తెలిసిందే.


 


సీఎం దాన్ని ప్రశంసించడంతో పాటు ఆ ప్రతిపాదనను వెంటనే సరేననడంతో సంబంధిత ఫైలు రెండు రోజులుగా ఆగమేఘాల మీద కదిలింది. ఉస్మానియాలో కాలేయ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎంటెక్ విద్యార్థి మహేశ్, నల్లగొండ జిల్లాకు చెందిన ఆటోడ్రైవర్ సైదులు పేర్లను సీఎం కార్యాలయానికి పంపించారు. వారికి సీఎం సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేస్తూ ఫైలుపై మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో మంగళవారం సచివాలయంలో సీఎం సంతకం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top