ఎమ్మెల్సీపై బీజేపీకి నిరాశ
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ ప్రయత్నించింది. గురువారం బీజేపీ నేతలు దత్తాత్రేయ, కె. లక్ష్మణ్ ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. బీజేపీ అభ్యర్థిని నిలిపితే టీఆర్ఎస్ తరపున ఐదో అభ్యర్థిని నిలపబోమని ఆ పార్టీ చేసిన ప్రకటనను గుర్తుచేశారు. ఇలాగైనా తమ అభ్యర్థిని నిలపాలని ప్రయత్నించారు. అయితే బీజేపీకి అవకాశమిచ్చేందుకు చంద్రబాబు ససేమిరా అన్నట్లు సమాచారం.
అక్కడే ఉన్న టీడీపీ నేతలు ఎర్రబెల్లి, రేవంత్రెడ్డి సైతం టీడీపీ అభ్యర్థినే పోటీలో నిలిపి గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. శాసనమండలిలో టీడీపీకి చోటు లేకుండా చేయాలన్న కుట్రలో భాగంగానే బీజేపీకి సీటిస్తే పోటీలో నిలపబోమని టీఆర్ఎస్ మైండ్గేమ్ ఆడుతోందని వారు బీజేపీ నేతలకు స్పష్టం చేశారు. దీంతో చేసేదేం లేక టీడీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు.