ఫాంహౌస్లో ఉంటే సమస్యలు తెలుస్తాయా?
కేసీఆర్పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ఫాంహౌస్లో ఉంటూ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు సమస్యలు ఎలా తెలుస్తాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. హైదరాబాద్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతన్నలు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని.. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోవడం, ప్రభుత్వం నుంచి రుణమాఫీ అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతులకు భరోసా ఇవ్వడంలో సర్కారు విఫలమైందని విమర్శించిన కోమటిరెడ్డి.. ఒకేసారి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జిల్లాలకు నీరందకుండా కృష్ణా ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు.