‘తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 65 నుంచి 70 సీట్లు వస్తాయని మాజీ మంత్రి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి 30 సీట్లు మాత్రమే వస్తాయని పేర్కొన్నారు. విలేకరులతో మంగళవారం ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మహబూబ్నగర్ నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 80 శాతం సీట్లు కాంగ్రెస్కు వస్తాయని ఆయన అంచనా వేశారు. అక్టోబర్లో పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉంటుందని వెల్లడించారు. పీసీసీ అధ్యక్ష పదవికి తాను కూడా రేసులో ఉన్నానని చెప్పారు. ఒక్క అవకాశం ఇవ్వమని రాహుల్ గాంధీని కోరినట్టు తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో తాను గజ్వేల్ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగి సీఎం కేసీఆర్ను ఓడగొడతానని అంతకుముందు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కేసీఆర్కు దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బోగస్ సర్వేలతో ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. నకిరేకల్, సూర్యాపేట నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు.