రైతు కష్టాలు మరిచి బిర్యానీలా!

రైతు కష్టాలు మరిచి బిర్యానీలా! - Sakshi


టీఆర్‌ఎస్‌ ప్లీనరీపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: కందులు, మిర్చి పంటలను కొనుగోలు చేయకపోవడంతో రైతులు కన్నీళ్లు పెడుతున్నా పట్టించుకోకుండా టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో బిర్యానీలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ విలాసాలు చేసుకుంటున్నారని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ... రైతులు అప్పుల పాలవుతున్నారని మూడేళ్లుగా చెబుతున్నా పట్టించుకోకుండా ఇప్పుడు రైతుల గురించి కేసీఆర్‌ మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.


మిషన్‌ భగీరథ, ప్రాజెక్టుల రీడిజైనింగ్‌తో పనులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారన్నారు. పత్తి పంట వేయొద్దని... కందులు, మిర్చి పంటలు సాగుచేయించిన ప్రభుత్వం మార్కెటింగ్‌ విషయంలో ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు చేస్తే కేసులు పెడతామంటూ ప్రభుత్వం బెదిరిస్తున్నదని, రాష్ట్రంలో ఏ శాఖలో అవినీతి లేదో సీఎం చెప్పాలని డిమాండ్‌ చేశారు. చేపల పెంపకం ఓ పెద్ద స్కామ్‌ అని, దీనిలో మూడు వందల కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు.


కేసులు పెడతారనే బెదిరింపులకు భయపడేది లేదన్నారు. కేసీఆర్‌నే ప్రజలు జైలుకు పంపుతారని కోమటిరెడ్డి హెచ్చరించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి, గూడూరు నారాయణరెడ్డికి మధ్య జరిగిన ఘర్షణ పెద్ద విషయం కాదని, దీన్ని పెద్దగా చేయాల్సిన అవసరం లేదన్నారు. టీఆర్‌ఎస్‌లో అంతర్గతంగా తీవ్రమైన విభేదాలున్నాయన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top