మేం టెర్రరిస్టులమా?

మేం టెర్రరిస్టులమా? - Sakshi

- వెంటపడి అరెస్ట్‌ చేస్తారా? 

జేఏసీ చైర్మన్‌ ప్రొ.కోదండరాం

నిజామాబాద్‌కు బయల్దేరిన జేఏసీ చైర్మన్‌

తూప్రాన్‌ టోల్‌ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు

 

తూప్రాన్‌/కౌడిపల్లి(నర్సాపూర్‌)/నిజామాబాద్‌ అర్బన్‌/కామారెడ్డి: ‘మేం ఏమైనా టెర్రరిస్టులమా? వెంటపడి అరెస్టు చేస్తారా? రాష్ట్రంలో నిరంకుశపాలన కోనసాగుతోంది’ అని జేఏసీ చైర్మన్‌ కోదండరాం ఆరోపించారు. టెర్రరిస్టులనూ ఇంతమంది పోలీసు బలగాలతో అరెస్టు చేయరని ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌కు అమరవీరుల స్ఫూర్తియాత్ర కోసం బయల్దేరిన కోదండరాంను మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలంలోని 44వ జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా వద్ద పోలీసులు శనివారం బలవంతంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరిపై కోదండరాం మండిపడ్డారు.



అమరవీరుల స్ఫూర్తి యాత్ర చేపట్టిన నేపథ్యంలో సమావేశం, ర్యాలీలో పాల్గొనేందుకు నిజామాబాద్‌ ఎస్పీ వద్ద అనుమతులు కోరినా ఆయన నిరాకరించారన్నారు. దీంతో తాము హాల్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమయ్యామన్నారు. ఈ సమావేశానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదన్నారు. తమ మీటింగ్‌ను కొనసాగనివ్వొద్దని ప్రభుత్వం  కుట్ర పన్నిందన్నారు. 151, 144 నిబంధనల ప్రకారం అరెస్టు చేస్తున్నామని చెబుతున్నా.. తామెక్కడా 144 సెక్షన్‌ను ఉల్లంఘించలేదన్నారు. కామారెడ్డి జిల్లాలో  తమపై దాడి జరిగి 24 గంటలు గడిచినా ఒక్కరినీ అరెస్టు చేయకపోగా తమపై ఆంక్షలు విధించడం సమంజసం కాదన్నారు.

 

భారీ బందోబస్తు..

కోదండరాంను అరెస్టు చేసి కౌడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. మధ్యాహ్నం స్టేషన్‌కు తీసుకొచ్చి సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్‌కు తరలించారు. అరెస్ట్‌ నేపథ్యంలో కౌడిపల్లిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేషన్‌ లోపలికి ఎవరినీ అనుమతించలేదు. కోదండరాంను కౌడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు తెలుసుకున్న నర్సాపూర్‌ జేఏసీ నాయకులు, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం పోలీస్‌స్టేషన్‌ నుంచి నర్సాపూర్‌ తరలిస్తుండగా విలేకరులు కోదండరాంతో మాట్లాడే ప్రయత్నం చేసినా పోలీసులు అనుమతించలేదు. వాహనం నుంచే ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా తెలంగాణ అమరవీరుల స్ఫూర్తియాత్ర కొనసాగిస్తున్నామని, పోలీసులతో తమను అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారని పేర్కొన్నారు.

 

జేఏసీ, విద్యార్థి నాయకుల అరెస్ట్‌

నిజామాబాద్‌లో శనివారం నిర్వహించ తలపెట్టిన యాత్రను పోలీసులు భగ్నం చేశారు. ఉదయం నుంచి జేఏసీ నాయకులను అడ్డుకున్నారు. ప్రధాన కేంద్రాలతో పాటు కలెక్టరేట్‌ మైదానం, ఎన్టీఆర్‌ చౌరస్తా ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు యాత్రను అడ్డుకోవడమే కాకుండా జేఏసీ నాయకులపై దాడి చేయడాన్ని నిరసిస్తూ జిల్లాలో అఖిలపక్ష నాయకులు ఆందోళన చేశారు. కామారెడ్డి బంద్‌ పాటించారు. బంద్‌ ప్రశాంతంగా సాగింది. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. బాన్సువాడ, పిట్లంలలో విద్యాసంస్థలను బంద్‌ చేయించారు.

 

అధికార దుర్వినియోగం అన్నందుకే..

ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని అన్నందుకే తమపై ప్రభుత్వం కుట్రపూరిత చర్యలకు పాల్పడుతోందని కోదండరాం విమర్శించారు. అధికారానికి ఆటంకంగా భావిస్తున్నారనే భావనతో తమను అరెస్టు చేయిస్తున్నారని ఆరోపించారు. అధికార దుర్వినియోగాలను జేఏసీ అడ్డుకుని బాధ్యతా యుతమైన పాలన కోసం కృషి చేస్తున్నందుకు  తమపై కుట్ర పన్నుతోందని విమర్శించారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top