'అవినీతి వల్లే కేసీఆర్ను బాబు తప్పించారు'
అవినీతికి పాల్పడినందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ను గతంలో చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గం నుంచి తొలగించారని టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం వ్యాఖ్యానించారు. కేసీఆర్ అప్పట్లో చేసిన తప్పును ఏపీ ముఖ్యమంత్రి స్పష్టంగా బహిర్గతం చేశారన్నారు.
మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్యను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడాన్ని ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. రాజయ్య చేసిన అవినీతి ఏంటన్నది బయటపెట్టాలని ఆయన కేసీఆర్ను డిమాండ్ చేశారు. తెలంగాణ కేబినెట్లో ముగ్గురు తప్ప అంతా తెలంగాణ ద్రోహులేనంటూ ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడని చెప్పిన కేసీఆర్.. తాను ఆ పదవి చేపట్టి, దళితులను మోసం చేశారని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.