'డబుల్ బెడ్ రూమ్ పథకానికి కట్టుబడి ఉన్నాం'
హైదరాబాద్: ఎన్నికల హామీల్లో భాగంగా తాము ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని అమలు చేసి తీరుతామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శనివారం రెండో రోజు హైదరాబాద్లో ఆయన జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ జిల్లా కలెక్టర్లుకు పలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీని ఘనంగా నిర్వహించాలని సూచించారు. అందుకోసం రూ. 20 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అలాగే పెరేడ్ నిర్వహణ, అమరవీరుల స్థూపాల వద్ద నివాళులర్పించాలన్నారు. గోదావరి పుష్కరాలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలన్నారు.
అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు... ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలన్నారు. రేషన్ బియ్యం బ్లాక్ మార్కెటింగ్పై కఠిన చర్య తీసుకోవాలని... అవసరమైతే నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రులను సందర్శించాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. గృహ నిర్మాణం అవినీతికి మారుపేరుగా నిలిచిందన్నారు. లబ్దిదారులపై భారం పడకుండా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామన్నారు.