కెసిఆర్ మార్క్ పాలన మొదలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు టిఆర్ఎస్ పరిపాలన మొదలుపెట్టారు. ఈ రోజు ఉదయం కెసిఆర్ మాట్లాడుతూ ఇంకా తమ పరిపాలన మొదలు కాలేదని, తమ పాలన మొదలైతే తమ మార్కు కనిపిస్తుందని చెప్పారు. ఆ తరువాత పాలనలో తమ మార్కు కనిపించే విధంగా కెసిఆర్ మూడు మంత్రి వర్గ ఉపసంఘాలను నియమించారు. రుణమాఫీ అమలు, కొత్త రేషన్ కార్డుల మంజూరు, సాగునీటి ప్రాజెక్టులపై ఉపసంఘాలను ఏర్పాటు చేశారు.
సమగ్ర సర్వే ఆధారంగా కొత్త రేషన్కార్డుల పంపిణీపై ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద్ర అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని వేశారు. రుణమాఫీ విధివిధానాల అమలు తీరుపై వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన మరో కమిటీని నియమించారు. సాగునీటి ప్రాజెక్టులు, లోపాల సవరణ, ప్రాజెక్టుల పూర్తిపై మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఇంకో ఉపసంఘం ఏర్పాటు చేశారు.
**