విద్యార్థి నేత వివాహానికి కేసీఆర్ హాజరు
వరంగల్, సాక్షిప్రతినిధి: హన్మకొండలో బుధవారం జరిగిన తెలంగాణ రాష్ర్ట సమితి విద్యార్థి విభాగం సెక్రెటరీ జనరల్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, రమ్య వివాహానికి సీఎం కేసీఆర్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి ఉదయం 11:30 గంటలకు సైన్స్, ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు సీఎం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వివాహ వేదిక వద్దకు వచ్చారు.
బిజీ షెడ్యూల్ ఉన్నందున కేవలం వధూవరులను దీవించి తిరిగి హైదరాబాద్ వెళ్లేలా తొలుత షెడ్యూల్ను రూపొందించారు. కాని అర్ధగంటకు పైగా పెళ్లి వేదిక ప్రాంగణంలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు జిల్లాలో అమలవుతున్న తీరుపై కలెక్టర్ కరుణను అడిగి తెలుసుకున్నారు. జనవరిలో వరంగల్ పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీలు పేదలకు ఇళ్ల నిర్మాణం, టెక్స్టైల్స్పార్కు స్థల సేకరణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్తో సీఎం చర్చించారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు.
భోపాల్ వెళ్లిన ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు సీఎం కేసీఆర్ వెళ్లారు. బుధవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేకవిమానంలో ఆయన బయలుదేరారు. గురువారం భోపాల్లో జరగనున్న ‘నీతి ఆయోగ్’ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.