బ్రాహ్మణ సొసైటీ ప్రారంభించాలి:కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: పేద బ్రాహ్మణుల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఓ సొసైటీని ప్రారంభించాలని సీఎం కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. బ్రాహ్మణ సదన్ కు ఇప్పటికే స్థలం కేటాయించినందున భవన నిర్మాణం ప్రారంభించాలని చెప్పారు. ప్రగతి భవన్ లో శుక్రవారం బ్రాహ్మణ సంక్షేమానికి చేపట్టే చర్యలపై సీఎం సమీక్షించారు. ‘బ్రాహ్మణుల సంక్షేమానికి ఇప్పటికే ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. బ్రాహ్మణ సదన్ కు స్థలం కేటాయించింది. నిధులు, సదన్ ను ఉపయోగించుకొని సంక్షేమ, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా సొసైటీని ఏర్పాటు చేయాలి.
త్వరలోనే సొసైటీని రిజిస్టర్ చేసి బాధ్యతలు అప్పగించాలి.’ అని సీఎం ఆదేశించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, హరీశ్రావు, తుమ్మల, జగదీశ్రెడ్డి, జోగు రామన్న, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, రమణాచారి, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్, కార్యదర్శులు శివశంకర్, భూపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.