బత్తాయి మార్కెట్‌ హింసకు కాంగ్రెస్సే కారణం

బత్తాయి మార్కెట్‌ హింసకు కాంగ్రెస్సే కారణం


హైదరాబాద్‌: నల్గొండలో బత్తాయి మార్కెట్ ప్రారంభం సందర్భంగా  జరిగిన హింసకు కాంగ్రెస్సే కారణమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ..కాంగ్రెస్ తీరు దొంగే దొంగ అన్నట్టుగా ఉందన్నారు. తనను గెలిపిస్తే బత్తాయి మార్కెట్ ఏర్పాటు చేయిస్తానని కోమటి రెడ్డి ప్రతి ఎన్నికలో చెప్పేవాడని, అధికారంలోకి వచ్చాక ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారని వాపోయారు.  మూడేళ్లు తిరగకుండానే నల్గొండలో బత్తాయి మార్కెట్ ఏర్పాటు చేసిన ఘనత మా ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతుల్లో ప్రభుత్వం పట్ల కనిపిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే కోమటి రెడ్డి కొత్త డ్రామాకు తెర లేపారని తెలిపారు.



మేం బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటే దాంట్లో చొరబడి స్వయంగా విధ్వంసం చేసింది కోమటి రెడ్డే కదా అని పేర్కొన్నారు. మా పార్టీ నేతలే ఈ దాడుల్లో టార్గెట్ అయ్యారని, మా వాళ్ల కార్లే ధ్వంసం అయ్యాయని వివరించారు. విచారణలో అన్నీ విషయాలు బయటికి వస్తాయన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండానే జానారెడ్డి, ఉత్తమ్, షబ్బీర్ అలీ, కోమటి రెడ్డి కి  ఎలా వంత పాడుతారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ నరరూప రాక్షసుల పార్టీ కాదు..కాంగ్రెస్సే నరరూప రాక్షసుల పార్టీ అని అనేక ఉదంతాలు తెలిపాయన్నారు. మీరు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు..ప్రతీకారం తీసుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదని జోస్యం చెప్పారు.  కాంగ్రెస్ వైఖరి మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్టు ఉందని చమత్కరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top