అది కాంగ్రెస్ ఆవేదన సభ..
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత
నవీపేట: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యం లో చేపట్టిన ‘జన ఆవేదన’సభను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ‘కాంగ్రెస్ ఆవేదన సభ’గా అభివర్ణించారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. జనంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతోందని భావించిన ఆ పార్టీ నాయకులు అమాయక ప్రజలను మోసం చేసేందుకు, తప్పుదోవ పట్టించేందుకు ఆ సభను నిర్వహించారన్నారు.
జన ఆవేదన సభకు బదులుగా కాంగ్రెస్ ఆవేదన సభ.. జానారెడ్డి ఆవేదన సభ.. దిగ్విజయ్ సింగ్ ఆవేదన సభ అని పేరు పెట్టాల్సిందని ఎద్దేవా చేశారు. పదేళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో ప్రజల ఆవేదన గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వాలని, అలా చేతగాకపోతే గమ్మున కూర్చోవాలని అన్నారు.