కడుపేదలకూ ‘ఆసరా’: సెర్ప్ సీఈవో
సాక్షి, హైదరాబాద్: దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్న కడుపేదలకూ సంక్షేమపథకాలు అందించాలనేది ప్రభుత్వం లక్ష్యమని గ్రామీణ పేదరిక నిర్మాలన సంస్థ(సెర్ప్) సీఈవో మురళి తెలిపారు. అనాథలు, భిక్షాటన చేసేవారు, కాగితాలు ఏరుకునే వారు, మురికివాడల్లో జీవిస్తున్నవారు తదితరుల అర్హతను బట్టి సామాజిక భద్రతా పింఛన్ ‘ఆసరా’ను అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు భావిస్తున్నట్టు ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమం అమలుపై శనివారం సెర్ప్ కార్యాలయంలో వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఆసరా పింఛన్ ఇప్పించేందుకు ఎన్జీవోలు ప్రభుత్వంతో కలసి పనిచేయాలని కోరారు.
జీహెచ్ఎంసీ పరిధిలో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు 50 వేలమంది సమగ్ర కుటుంబ సర్వే(ఎస్కేఎస్)లో వివరాలు నమోదు చేసుకోలేదని, వారికి మరోసారి అవకాశం కల్పిస్తున్నామని మురళి వెల్లడించారు. ఆసరాకు అర్హులైన వారికి ఆధార్ను ఇప్పించాల్సిన బాధ్యత కూడా చేపట్టాలని ఆయన ఎన్జీవోల ప్రతినిధులను కోరారు.