అందుకే కడియం రుద్రమదేవి ఫంక్షన్కు వెళ్లారు
హైదరాబాద్: రుద్రమదేవి చిత్ర ఆడియో విడుదలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని నన్ను కోరారని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్రావు తెలిపారు. అయితే తమ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఇంటర్వెల్ సమయంలో ప్రదర్శిస్తే... డిప్యూటీ సీఎం ఈ కార్యక్రమానికి హాజరవుతారని వారికి హామీ ఇచ్చానని... తన ప్రతిపాదనకు వారు అంగీకరించారని... ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రుద్రమదేవి ఆడియో ఫంక్షన్కు హాజరయ్యారని వెల్లడించారు.
గురువారం హైదరాబాద్లో మంత్రి హరీష్రావు విలేకర్లతో మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిఒక్క సభ్యుడికి సభలో మాట్లాడే అవకాశం కల్పించామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా నిర్వహించామని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే సమావేశాలు పొడిగించాలని తమను ఏ పార్టీకి చెందిన వారు అడగలేదన్నారు.