జూబ్లీహిల్స్ క్లబ్ అధ్యక్షుడిగా దేవేందర్‌రెడ్డి

జూబ్లీహిల్స్ క్లబ్ అధ్యక్షుడిగా దేవేందర్‌రెడ్డి - Sakshi


బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ పాలక కమిటీ ఎన్నికల్లో టి. దేవేందర్‌రెడ్డి ప్యానల్ ఘనవిజయం సాధించింది. తన ప్రత్యర్థి జైవీర్‌రెడ్డిపై దాదాపు 951 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. దేవేందర్‌రెడ్డితో పాటుగా సభ్యులు సైతం సుమారు 900 పైచిలుకు మెజారిటీతోనే ఈ విజయం దక్కించుకున్నారు. జూబ్లీహిల్స్ క్లబ్ పాలక వర్గానికి ఆరేళ్ల తర్వాత ఎన్నికలు ఆదివారం క్లబ్ సెక్రటరీ హనుమంతరావు ఆధ్వర్యంలో ప్రశాంతంగా జరిగాయి.



ఈ ఎన్నికల్లో రెండు ప్యానల్ పోటీ పడ్డాయి. దేవేందర్‌రెడ్డి అధ్యక్షునిగా జగ్గారావు, రమేష్‌చౌదరి, శ్రీనివాస్‌రెడ్డి, విద్యాసాగర్‌లు సభ్యులుగా బరిలో నిలిచారు. మరో ప్యానల్ జూవీర్‌రెడ్డి అధ్యక్షతన అశోక్‌రెడ్డి, కిషన్‌రావు, ఏవీఆర్‌కే. ప్రసాద్, డాక్టర్. జీఆర్‌యం. రెడ్డిలు ఎన్నికల్లో పోటీ చేశారు. సంయుక్త కార్యదర్శిగా పీఎస్.రెడ్డి సంయుక్త కార్యదర్శిగా ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో భాగంగా క్లబ్‌లోని 2560 మంది ఓటు హక్కు ఉన్న సభ్యుల్లో 1863 మంది వారి ఓటు వేశారు.



అంతకుముందు ఈవీయం మిషన్లతో ఏర్పాటు చేసిన ఈ ఎన్నికల్లో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, నరేంద్రచౌదరి, సీవీ.రావు తదితర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేవేందర్‌రెడ్డి ప్యానల్ విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించిన అనంతరం ప్యానల్ ఆధ్వర్యంలో క్లబ్ ముందు బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ క్లబ్ తో పాటు సభ్యులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. కోశాధికారి జగ్గారావును ఎకగ్రీవంగా ఎన్నుకున్నట్లు దేవేందర్‌రెడ్డి ప్రకటించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top