పెట్టుబడి రూ.50 వేలు..దిగుబడి రూ.28 వేలే


మనోవేదనతో ఆగిన మిర్చి రైతు గుండె



నెల్లికుదురు (మహబూబాబాద్‌): అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పంట పం డిస్తే.. పెట్టుబడి కూడా రాక ఓ రైతు మనోవేదనతో కుప్పకూలాడు. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడు జయరాం తండాలో శుక్రవారం రాత్రి జరిగింది. జయరాం తండాకు చెందిన గుగులోతు రెడ్యా(60) రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో ఒక ఎకరంలో మిరప పంట సాగుచేశాడు. 50 వేల అప్పు తెచ్చి పెట్టుబడిపెట్టాడు. మిరప దిగుబడిని ఈ నెల 13న వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్‌కు తీసుకెళ్లాడు. అక్కడి వ్యాపారులు క్వింటాల్‌కు రూ.3500 ఇచ్చారు. క్వింటా రూ.10 వేలు వస్తాయనుకుంటే ఇంత తక్కువ ధర వచ్చిందని చెప్పుకుంటూ బాధపడినట్లు గ్రామస్తులు చెప్పారు. 18 బస్తాల మిర్చికి రూ.28 వేలు వచ్చాయి. ఆ డబ్బు తీసుకుని శుక్రవారం రాత్రి ఇంటికి బయలుదేరాడు. మునిగలవీడు బస్టాప్‌ వద్ద బస్సు దిగి ఒక్కసారిగా గుండెపోటుకు గురై మృతి చెందాడు.  



ఇద్దరు రైతుల బలవన్మరణం

కామేపల్లి/మధిర: ఖమ్మం జిల్లాలో మరో ఇద్దరు రైతులు అప్పుల బాధ తాళలేక శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. కామేపల్లి మండలం గోవింద్రాలబంజర గ్రామానికి చెందిన బానోత్‌ అరుణ(40), ఇదే జిల్లా మధిర మండలం రొంపిమళ్ల గ్రామానికి చెందిన కౌలు రైతు పోతగాని పుల్లారావు(37) అప్పుల బాధ తాళలేక  బలవన్మరణాలకు పాల్పడ్డారు.



చేనేత కార్మికుడి ఆత్మహత్య

ఎల్కతుర్తి: అనారోగ్యంతో ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెరలో మండల కొమురయ్య(70) సిరిసిల్లలో చేనేత కార్మికునిగా పని చేస్తున్నాడు. నెలక్రితం అనారోగ్యానికి గురి కావడంతో స్వగ్రామానికి వచ్చాడు. చేనేత పనిచేసేందుకు ఆరోగ్యం సహకరించక పోవడంతో మనస్తాపం చెంది శనివారం ఇంట్లో ఉరేసుకున్నాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top