వామ్మో.. ఇవేం బిల్లులు


పెద్దేముల్: గ్రామ పంచాయతీ కార్యాలయాలకు కరెంట్ బిల్లులు రూ.లక్షల్లో వస్తుండడంతో సర్పంచులు కంగుతింటున్నారు. యేడాదికి రూ. ఐదువేలు ఆదాయం రాని పంచాయతీలకు రూ.లక్షల్లో బిల్లులు వస్తే ఎలా చెల్లించాలని పలు గ్రామాల సర్పంచులు వాపోతున్నారు. మూడు రోజులుగా మండలంలోని సర్పంచులకు విద్యుత్ అధికారులు కరెంట్ బిల్లులు, నోటీసులు పంపిస్తున్నారు. మండలంలో మొత్తం 25 గ్రామ పంచాయతీలు, 27 అనుబంధ గ్రామాలు ఉన్నాయి.



పంచాయతీ కార్యాలయం, వీధిదీపాలు, తాగునీరు సరఫరా చేసేందుకు వాడుకున్న కరెంట్‌కు బిల్లులు చెల్లించాలని విద్యుత్ అధికారులు నోటీసులు జారీచేశారు. నోటీసులు చూసిన సర్పంచులు అవాక్కవుతున్నారు. ఎన్నడూ లేని విధంగా పంచాయతీలకు కరెంట్ బిల్లులు రావడం ఏమిటని వారు ఆశ్చర్యపోతున్నారు. పంచాయతీ ఏర్పడిననాటి నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని కచ్చితంగా చెల్లించాలని అధికారులు చెబుతున్నారు. పంచాయతీ కార్యాలయాల్లో విద్యుత్ మీటర్లు లేవు, బిల్లులు ఎలా వేస్తున్నారో చెప్పాలని సర్పంచులు కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి చిల్లిగవ్వ రావడం లేదు.. రూ.లక్షలకు లక్షలు బిల్లులంటే ఎట్లా కట్టేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top