'బీసీల సంక్షేమానికి పెద్దపీట'


రాష్ట్ర జనాభాలో అధికంగా ఉన్న బీసీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర అటవీశాఖా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం ఆటోనగర్‌లోని మహావీర్ హరిణ వనస్థలి జాతీయ పార్కులో తెలంగాణ మున్నూరుకాపు ఎంప్లాయీస్, ప్రొఫెషనల్స్ ఎల్‌బీనగర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీకమాస వనభోజనాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.


ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని వచ్చే సంవత్సరం నుంచి ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్న విధంగానే బీసీలకు కూడా కళ్యాణలక్ష్మీ పథకాన్ని అమలు చేయనుందని చెప్పారు. బీసీ స్టడీ సర్కిళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలను పెంచేందుకు ప్రభుత్వం కతనిశ్చయంతో ఉందన్నారు. త్వరలోనే మున్నూరుకాపు రాష్ట్రస్థాయి సమ్మేళనాన్ని హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి ఒప్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top