ఇఫ్తార్ విందు 12కు వాయిదా
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీన ఇవ్వతలపెట్టిన ఇఫ్తార్ విందును 12వ తేదీకి వాయిదా వేశామని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం హరిత హారం కార్యక్రమంతో తీరిక లేకుండా ఉన్నందున ఈ మార్పు చేశామని చెప్పారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఈనెల 12వ తేదీన నిజాం కాలేజీ గ్రౌండ్లో జరిగే ఇఫ్తార్ విందుకు కనీసం ఆరువేల నుంచి ఏడువేల మంది హాజరవుతారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ కోసం రూ.26 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నూరు మసీదుల్లో, ప్రతీ నియోజకవర్గంలో ఒక పెద్ద మసీదులో ఇఫ్తార్ విందులకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఒక్కో మసీదులో ఇందుకోసం రూ.2 లక్షలు వెచ్చిస్తున్నామని తెలిపారు. 1.95లక్షల మందికి దుస్తులు పంపిణీ చేయనున్నామని, దీనికి సంబంధించి టెండర్లు పిలుస్తున్నామని మహమూద్ అలీ వివరించారు.