నేనూ హాస్టల్‌లో ఉండే చదువుకున్న..

నేనూ హాస్టల్‌లో ఉండే చదువుకున్న.. - Sakshi


చాలామంది మంత్రులు వసతిగృహాల్లో చదువుకుని వచ్చినవారే..

ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్


 వికారాబాద్: ‘నేనూ హాస్టల్‌లో ఉండి చదువుకున్న వాడినే.. ఉడికీ ఉడకని అన్నం భోంచేసిన వాడినే..’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కేబినెట్ మంత్రుల్లో చాలామంది వసతిగృహాల్లో ఉండి చదువుకుని వచ్చిన వారేనన్నారు. జేఏసీ జిల్లా అధ్యక్షుడు, వికాస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అధ్యక్షతన గురువారం జరిగిన కళాశాల 14 వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. వికారాబాద్ హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్నప్పటికీ అన్నిరంగాల్లో వె నకబడి ఉందన్నారు.



భూగర్భజలాలు ఎక్కడ చూసినా కనుమరుగయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో చదివే విద్యార్థులు మంచి జియలజిస్టులుగా తయారు కావాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు మేథావులుగా తయారై, రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలన్నారు. విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలంటే ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లాలని హితవు పలికారు.

 

మార్కులు విద్యలో ప్రామాణికమని అనుకోవడం లేదన్నారు. లక్ష్యం లేకుండా ఏ గమ్యస్థానం చేరుకోలేమన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదివి సివిల్స్ రాసి, ఐఏఎస్, ఐపీఎస్ అయిన వారు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అనుగుణంగా విధులు నిర్వహించడం చాలా కష్టంగా ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతంలో చదువుకొని సివిల్స్ రాసి ఐపీఎస్, ఐఏఎస్ అయినవారు గ్రామీణ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడతారన్నారు. అనంతరం రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హయంలో చె ల్లించాల్సిన పెండింగ్ ఫీజ్ రియింబర్స్‌మెంట్ నిధులను తమ ప్రభుత్వం ఇటీవలే రూ.800 కోట్లు విడుదల చేసి, విద్యార్థులను ఆదుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.



అనంతరం ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ విద్యార్థులు చదివింది ఎప్పటికప్పుడు నెమరు వేసుకోవాలన్నారు. చదివు లేకుంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించే వారే కాదన్నారు. కార్పొరేట్ కళాశాల యజామాన్యాలు విద్యార్థులను పీల్చి పిప్పి చేస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. చదువుతోపాటు ఆటపాటలు, విశ్రాంతి కల్పించాలన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు విఠల్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ఎంత చదివినా తక్కువేనన్నారు.



భవిష్యత్‌లో నిరుద్యోగులకు అనేక ఉపాధి అవకాశాలురానున్నాయన్నారు. కార్యక్రమంలో టీఎస్ జేఏసీ రాష్ట్ర కో ఆర్డినేటర్ శుభప్రద్ పటేల్, ప్రజాప్రతినిధులు ఎంపీపీ సామల బాగ్యలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు ముత్తార్ షరీఫ్, నాయకులు ఎల్లారెడ్డి, దేవకీదేవి, కడియాల శేఖర్, విఠల్, ప్రైవేట్ జూనియర్ కళాశాల రాష్ట్ర అధ్యక్షుడు సతీష్, కళాశాల డైరక్టర్ సత్యనారాయణరెడ్డి, నాయకులు రాంరెడ్డి, బి.కృష్ణయ్య, లక్ష్మారెడ్డి, రాంచంద్రరెడ్డి, పి వెంకటయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top