భట్టి విక్రమార్కతో ఏకీభవిస్తున్నా: రేవంత్రెడ్డి


కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతే డీఎల్ఎఫ్ భూముల బదలాయింపు జరిగిందన్న భట్టి విక్రమార్క వాదనతో తాను ఏకీభవిస్తున్నట్లు టీడీఎల్పీ ఉపనేత రేవంత్రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో భూబాగోతాన్ని లేవనెత్తిన తనను అధికారపక్షం మాట్లాడనివ్వలేదని ఆయన అన్నారు. డీఎల్ఎఫ్ నుంచి అర్హతలు లేని మరో కంపెనీకి భూమిని బదలాయించి, దానికి ప్రతిగా డీఎల్ఎఫ్కు ఖరీదైన భూములు ఇచ్చేశారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ నిర్ణయం వల్ల మైహోం కంపెనీ అధినేత రామేశ్వరరావుకు రూ. 300 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు.



సీఎం కేసీఆర్ విచారణ జరిపిస్తే ఇది కుంభకోణమని తాను నిరూపిస్తానని రేవంత్ సవాలు చేశారు. ఆపరేషన్ బ్లూస్టార్ పేరుతో తన గొంతు నొక్కి, ప్రాణాలు హరించాలని చూస్తే ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. అవినీతి బాగోతం బయటపడుతుందనే అధికారపక్షం మాట్లాడకుండా సభ నుంచి పారిపోయిందని ఎద్దేవా చేశారు. చర్చ ముగిసిపోయిన తర్వాత ఈ వ్యవహారంపై ఫైళ్లను స్పీకర్ వద్ద ఉంచితే ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. ప్రభుత్వం తప్పు చేసిందన్న తమ వాదనను కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క నిరూపించారని రేవంత్ రెడ్డి చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top