ఆడపిల్ల పుట్టిందని.. భార్యను చంపేశాడు
చింతకాని (మధిర): ఆడపిల్ల పుట్టిందని కట్టుకున్న భార్యను కడతేర్చాడో ప్రబుద్ధుడు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం గ్రామానికి చెందిన షేక్ సైదులు, రంజాన్ దంపతుల పెద్దకుమార్తె ఉమీనా బేగం (21)కు బొప్పారం గ్రామానికి చెందిన షేక్ సిద్ధాసాహెబ్, కుమారుడు షేక్ శ్రీనుతో గతేడాది వివాహం జరిగింది. 45 రోజుల క్రితం ఉమీనాబేగం ఆడపిల్లకు జన్మనిచ్చి, తల్లిగారింటి వద్దే ఉంటోంది.
శనివారం భార్యను చూసేందుకు వచ్చిన శ్రీను అర్ధరాత్రి గొడవపడి, ఆమె మెడకు చున్నీ బిగించి హతమార్చాడు. ఆడపిల్ల పుట్టిందనే కోపంతో ఆస్పత్రిలోనే పసిపాపను చంపేందుకు ప్రయత్నించటంతో తాము అడ్డుకున్నామని, వివాహం అయిన నెలరోజుల నుంచే వరకట్న వేధింపులకు పాల్పడుతున్నాడని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సురేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.