భార్యను చంపిన భర్తకు రిమాండ్


జవహర్‌నగర్ (హైదరాబాద్) : భార్యను చంపిన ఓ భర్తను జవహర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌కు చెందిన చింతల వెంకటేష్ (24), మల్కాజిగిరి మిర్జాలగూడకు చెందిన చింతల రేణుక(22)లు ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వెంకటేష్ కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా రేణుక ఇంట్లోనే ఉండేది. కొంతకాలం మల్కాజిగిరి ప్రాంతంలో ఉన్న వీరు సంవత్సర క్రితం కాప్రా సర్కిల్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడకు మారి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అయితే కొన్ని రోజులుగా దంపతులు గొడవపడుతున్నారు.



కాగా రేణుక ఇతరులతో సన్నిహితంగా మాట్లాడుతుందనే కారణంతో కొన్ని రోజులుగా వెంకటేష్ అనుమానిస్తూ ఆమెను వేధించసాగాడు. పలుమార్లు ఆమెపై దాడులు కూడా చేశాడు. ఈ క్రమంలో ఆగస్టు 27న అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న రేణుకను చున్నీతో ఉరివేసి వెంకటేష్ హత్య చేశాడు. అనంతరం అతడు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top