క్యాంపు రాజకీయాలు..

క్యాంపు రాజకీయాలు.. - Sakshi


  గంగాధర మండలంలో హంగ్ ఏర్పడింది. మొత్తం 14 స్థానాలకు కాంగ్రెస్ 5 గెలిచింది. బీజేపీ నాలుగు గెలిచింది. టీఆర్‌ఎస్ మూడు స్థానాలు గెలిచింది. ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. బీజేపీకి ఇద్దరు స్వతంత్రులు మద్దతు ఉంది. ప్రస్తుతం రెండు పార్టీలు క్యాంపు నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి బూర్గుపల్లి ఎంపీటీసీ బాలాగౌడ్, కురిక్యాల ఎంపీటీసీ నందయ్య ఎంపీపీకోసం ఒకే క్యాంపులో ఉన్నారు. బీజేపీ నుంచి గంగాధర ఎంపీటీసీ పెరుక మల్లారెడ్డి ఇద్దరు స్వతంత్రులతో కలిసి క్యాంపు నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్ మద్దతు కీలకంగా మారింది.



  ఎల్కతుర్తి మండలంలో టీఆర్‌ఎస్‌కు 5, కాంగ్రెస్‌కు 5, స్వతంత్ర, టీడీపీ అభ్యర్థులు చెరో స్థానంలో గెలిచారు.  స్వతంత్ర, టీడీపీ అభ్యర్థులు టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మరోపక్క ఎమ్మెల్యే ఎన్నిక తర్వాత ఏ పార్టీ గెలిస్తే వారికి మద్దతివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది.



  చందుర్తి మండలంలో హంగ్ ఏర్పడింది. మొత్తం 12 స్థానాలకు కాంగ్రెస్ 5, ఇండిపెండెంట్లు ముగ్గురు, బీజేపీ, టీఆర్‌ఎస్‌లు రెండు సీట్ల చొప్పున గెలిచాయి. స్వతంత్రులు ముగ్గురు బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇద్దరు టీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో ఒకరిని బీజేపీ మద్దతు కోరుతోంది. మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవిని ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.  



  ఇల్లంతకుంట మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకు ఏడు టీఆర్‌ఎస్, ఆరు కాంగ్రెస్, రెండు ఇతరులు గెలుచుకోగా అక్కడ హంగ్ ఏర్పడింది. ఇక్కడ టీఆర్‌ఎస్‌కు ఒక సీటు అవసరముండగా ఇతరుల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. అనంతగిరి ఇండిపెండెంట్ అభ్యర్థిని టీఆర్‌ఎస్ మద్దతు అడుగుతుండగా, రహీంఖాన్‌పేట, అనంతగిరి స్వతంత్రులిద్దరి మద్దతును కాంగ్రెస్ కోరుతున్నాయి. ఎంపీపీకి అవసరమైన మెజార్టీ కోసం టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పావులు కదుపుతూ క్యాంపు రాజకీయాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.



  చిగురుమామిడి మండలంలో 12 స్థానాలున్నాయి. సీపీఐకి4, కాంగ్రెస్‌కు 4, బీజేపీకి 1, టీఆర్‌ఎస్‌కు 2, స్వతంత్రుడొకరు గెలుపొందారు. కాంగ్రెస్, సీపీఐ కలిసి ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు యత్నాలు చేస్తున్నారు. అయితే టీఆర్‌ఎస్‌ను కలుపుకునేందుకు సీపీఐ యత్నిస్తున్నది. మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డితో సీపీఐ ఎంపీటీసీ అభ్యర్థులు చర్చలు జరిపారు.



  ముస్తాబాద్ మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలుండగా.. టీఆర్‌ఎస్ 4, కాంగ్రెస్ 4, బీజేపీ 3, టీడీపీ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కొక్కరు గెలుపొందారు. ఇందులో టీఆర్‌ఎస్, ముగ్గురు బీజేపీ అభ్యర్థుల మద్దతు తీసుకుని ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. టీఆర్‌ఎస్ పార్టీ బీజేపీ అభ్యర్థులతో తిరుపతిలో క్యాంపుకెళ్లింది.



  కోహెడలో 13 స్థానాలున్నాయి. టీఆర్‌ఎస్ 6, కాంగ్రెస్ 5, టీడీపీ 1, ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు. స్వతంత్ర అభ్యర్థిని తీసుకుని టీఆర్‌ఎస్ సింగపూర్‌కు క్యాంపు కెళ్లింది. ఎమ్మెల్యేగా అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి గెలిస్తే.. టీడీపీ అభ్యర్థితోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థి కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అవకాశాలున్నాయి.



  మల్హర్‌లో హంగ్ ఏర్పడింది. మొత్తం ఏడు స్థానాలకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు చెరో మూడుస్థానాలు కైవసం చేసుకున్నాయి. టీడీపీ ఒక చోట గెలిచింది. ఎమ్మెల్యేగా ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారోనని వేచి చూసి ఆ పార్టీకి మద్దతిచ్చేందుకు టీడీపీ అభ్యర్థి ఉన్నాడు.



  ఇబ్రహీంపట్నం మండలంలో ఎంపీటీసీ స్థానాలు మొత్తం 15 ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్‌కు 6, టీఆర్‌ఎస్‌కు 5, బీజేపీకి 1, ఇండిపెండెంట్లు 3 వచ్చాయి. దీంతో ఎంపీపీ పీఠం విషయంలో హంగ్ పరిస్థితి నెలకొంది. ఇండిపెండెంట్లు, బీజేపీ ఎంపీటీసీల మద్దతు కోసం కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకులు మంతనాలు చేస్తున్నారు.



  కథలాపూర్‌లో 13 స్థానాలుండగా.. టీఆర్‌ఎస్, బీజేపీలు చెరో 5 స్థానాలను సమానంగా దక్కించుకున్నాయి. ఇరుపార్టీలూ ఓ ఒప్పందానికి వచ్చాయి. ఎంపీపీ స్థానం కాంగ్రెస్ పార్టీ, ఉపాధ్యక్ష పదవి బీజేపీకి ఖరారైంది.



  సైదాపూర్ మండలంలో కాంగ్రెస్4, టీఆర్‌ఎస్ 4, బీజేపీ 3, స్వతంత్రుడు 1 స్థానంలో గెలుపొందగా.. ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ పీఠం బీజేపీకి లేదా కాంగ్రెస్ దక్కించుకునే అవకాశముంది. ఇక్కడ ఎంపీపీ పీఠం ఇవ్వాలని బీజేపీ కోరుతోంది. ఇక్కడ బీజేపీకి చెందిన ముగ్గురు సభ్యులు ఎవరికి మద్దతునిస్తే వారే ఎంపీపీ పీఠం అధిరోహిస్తారు.



  రామగుండం మండలంలో.. 14 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. టీఆర్‌ఎస్‌కు 4, కాంగ్రెస్-3, వైఎస్సార్‌సీపీ, బీజేపీకి చెరో ఒకటి, స్వతంత్రులు ఐదు చోట్ల గెలిచారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ అభ్యర్థులతో క్యాంపు నిర్వహిస్తోంది. వారికి వైఎస్సార్‌సీపీ, బీజేపీ అభ్యర్థులు, ఇండిపెండెంట్ ఇద్దరు మద్దతు తెలిపి క్యాంపులో చేరారు.



  కోరుట్ల మండలంలో 12 స్థానాలకు టీఆర్‌ఎస్ 6, కాంగ్రెస్ 5, ఇండిపెండెంట్ ఒకరు గెలుపొందారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు క్యాంపులో ఉన్నారు. ఎమ్మెల్యే ఎన్నిక తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు తేలనుంది.



  మెట్‌పల్లి మండలంలో ఎంపీటీసీ స్థానాలు 10 ఉండగా, కాంగ్రెస్‌కు 5, టీఆర్‌ఎస్ 3, బీజేపీ1, ఇండిపెండెంట్ 1 గెలుపొందారు. మేజిక్ ఫిగర్ 6 కాగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు ఈ మేజిక్ ఫిగర్ కోసం యత్నిస్తున్నాయి. క్యాంపులు లేవు.


  


Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top