పట్టపగలే భారీ చోరీ

పట్టపగలే భారీ చోరీ - Sakshi

- రూ.13 లక్షల నగదు, 70 తులాల బంగారం అపహరణ 

రంగారెడ్డి జిల్లా రాగన్నగూడలో ఘటన

 

ఇబ్రహీంపట్నం రూరల్‌: పట్టపగలే భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంట్లోకి చొరబడి భారీఎత్తున నగదు, నగలు ఎత్తుకెళ్లిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం రాగన్నగూడలోని సామ లక్ష్మారెడ్డి నగర్‌లో ఉంటున్న సామ భీంరెడ్డి పంచాయతీ వార్డు సభ్యుడు. రియల్‌ఎస్టేట్, రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తుంటాడు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు భీంరెడ్డి భార్య వరలక్ష్మి ఇంటికి తాళం వేసి పక్కనే ఉన్న స్నేహితుల ఇంటికి వెళ్లింది.



సాయంత్రం 5.30కి తిరిగి వెళ్లిన ఆమె తాళం తీసి లోపలికి వెళ్లి చూడగా... వెనుక వైపు తలుపు పగులగొట్టి ఉంది. బెడ్‌రూమ్‌లోని కబోర్డును పగులగొట్టి రూ.13 లక్షల నగదుతో పాటు 70 తులాల బంగారం దొంగలు దోచుకెళ్లినట్టు గుర్తించింది. వరలక్ష్మి వెంటనే భర్త భీంరెడ్డికి ఫోన్‌ చేసి చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇంట్లో ఆధారాలు సేకరించారు. సంఘటన స్థలాన్ని ఎల్‌బీనగర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు, ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి పరిశీలించారు. కొద్ది రోజుల క్రితమే తన కుమారుడి వివాహమైందని, కోడలికి పెట్టిన బంగారం దొంగలు ఎత్తుకెళ్లారని వరలక్ష్మి వాపోయారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top