వృద్ధదంపతులపై తేనెటీగల దాడి
నల్గొండ (భువనగిరి) : భువనగిరి మండలం ఎర్రంపెల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో తేనెటీగలు ఓ వృద్ధదంపతులపై దాడిచేశాయి. రోడ్డుపక్కనున్న చెట్టు కింద సేదతీరుతున్న సమయంలో కోతులు అక్కడికి చేరుకున్నాయి. కోతులు చెట్టెక్కి తేనెతుట్టెను కదిలించడంతో తేనెటీగలు వృద్ధదంపతులపై పడ్డాయి.
మీదపడ్డ తేనెటీగలు బాగా కుట్టడంతో దంపతుల ముఖమంతా వాచిపోయింది. గాయపడిన దంపతులు మైతిరెడ్డి(65), అండమ్మ(60)లను స్థానికులు భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దంపతుల స్వగ్రామం వలిగొండ మండలం ఏడుమెట్ల. వ్యక్తిగత పనుల నిమిత్తం గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చినపుడు ఈ సంఘటన చోటుచేసుకుంది.