హైందవ సంస్కృతిని కాపాడుకుందాం
వీహెచ్పీ జాతీయ సహకార్యదర్శి
గుమ్మల సత్యంజీ
అమరచింత (వనపర్తి) : విదేశియుల పరిపాలనలో హైందవ సంస్కృతి మరుగునపడిపోయిందని, పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రతిఒక్కరు కంకణబద్దులుగా మారాలని విశ్వహిందూపరిషత్ జాతీయ సహ కార్యదర్శి గుమ్మల సత్యంజీ పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి అమరచింత రామాలయంలో నిర్వహించిన హిందూ సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భగవంతుడు సాక్షాత్తు మానవరూపంలో అవతరించి భక్తులను కరుణించి దేవతలుగా పూజలందుకుంటున్న భారతావణి ప్రపంచ దేశాలకు ఆదర్శమన్నారు. పిలిస్తే పలికే దేవతలు ఉన్న భరతభూమిలో హిందూ సాంప్రదాయాలు దినదిన అభివృద్ధి చెందాలని వీటి పరిరక్షణ కోసం విశ్వహిందూ పరిషత్ అనేక ధార్మిక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ప్రస్తుతం శ్రీరామనవమిని పురస్కరించుకుని ప్రతి గ్రామంలో రామోత్సవాలు నిర్వహించి హనుమాన్ జయంతి వరకు ప్రతిఒక్కరు దీక్ష చేపట్టాలన్నారు. కార్యక్రమంలో వీహెచ్పీ జిల్లా గౌరవ అధ్యక్షుడు గాండ్ల రాములు, విభాగ్ ప్రముఖ్ అద్దాని నరేందర్, జిల్లా ధర్మాచార్యులు లక్ష్మీనందస్వామి, వీహెచ్పీ విభాగ్ తత్సాంగ్ రాచాల జనార్దన్, జిల్లా సహకార్యదర్శి మహేష్జీ , బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగభూషణంగౌడ్, సాహితి పరిషత్ అధ్యక్షుడు బాబుదేవిదాస్, నాయకులు పాల్గొన్నారు.