అక్బర్‌ఖాన్‌ లొంగుబాటు హైడ్రామా


విలేకరులను బ్లాక్‌మెయిల్‌ చేయడానికి యత్నం



మహదేవపూర్‌(మంథని): మహదేవపూర్‌ అడవుల్లో జరిగిన దుప్పుల వేట కేసులో ప్రధాన నిందితుడు, టీఆర్‌ఎస్‌ నాయకుడు అక్బర్‌ఖాన్‌ శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు లొంగుబాటు హైడ్రా మాను రక్తి కట్టించాడు. వేటగాళ్లను అరెస్టు చేయాలని టీవీలో వాయిస్‌ ఇచ్చిన ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు వార్తలు రాసిన విలేకరులను ఫోన్‌లో బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు తెలిసింది. ఈ మేరకు మంథనిలో శుక్రవారం జరిగిన టీఆర్‌ఎస్‌ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఓ రాష్ట్ర మంత్రి కాన్వాయిలో ఉన్న మంథనికి చెందిన నాయకుడి వాహనంలో అక్బర్‌ఖాన్‌ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.



అయితే, శనివారం మంథని కోర్టులో లొంగిపోతాడని, జడ్జి ఎదుట ఇచ్చే వాంగ్మూలంలో వేటగాళ్ల ముఠాలో ఒక విలేకరి కూడా ఉన్నట్లు చెబుతాడని ప్రచారం జరిగింది. ఉదయం 9 గంటలకు కాటారం పోలీసుల ఎదుట అక్బర్‌ఖాన్‌ లొంగిపోతాడని కొందరు, మధ్యాహ్నం 12 గంటలకు భూపాలపల్లి ఎస్‌పీ ఎదుట అని మరికొందరు, మధ్యాహ్నం 3 గంటలకు మంథని కోర్టులో లొంగిపో తాడని అక్బర్‌ఖాన్‌కు సంబంధించిన వ్యక్తులు ప్రచారం చేశారు. ఇలా రోజంతా అక్బర్‌ఖాన్‌ లొంగుబాటు హైడ్రామా చివరకు అబద్ధమని తేలింది. అయితే, అక్బర్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం అందింది.



అసలు నిందితులు విదేశాలకు..

భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ అడవుల్లో జరిగిన దుప్పుల వేట కేసులో అటవీశాఖ.. పోలీసు అధికారుల అలసత్యంతో నిందితులు దేశం దాటారనే ప్రచారం సాగుతోంది. మార్చి 19న జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ అడవుల్లో ఐదు దుప్పులను వేటాడిన హంటింగ్‌ మాఫియా 20వ తేదీ వరకు మండల కేంద్రంలోనే ఉన్నా..  అధికారులు పట్టించుకోకపోవడంతో ‘ఇంటి వద్ద ఉన్నప్పుడు ఊరుకుని.. ఇప్పుడు ఇంటర్‌ పోల్‌ సాయం’అడగాల్సిన దుస్థితి ఏర్పడిందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి మార్చి 18న మహదేవపూర్‌కు చేరుకున్న వేటగాళ్ల బృందం అక్బర్‌ఖాన్‌కు చెం దిన పార్టీ కార్యాలయంలో విందు చేసుకుని, పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీ నుంచి షికారు సత్యంను పిలిపించుకుని 19న దర్జాగా మహదేవపూర్, పలిమెల అడవుల్లో వేట సాగించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top