ఆ ఐదుగురు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు


సాక్షి, హైదరాబాద్: టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్సీలు బి.వెంకటేశ్వర్లు, మహ్మద్ సలీం, పి.నరేందర్‌రెడ్డి, వి.గంగాధర్‌గౌడ్, బి.లక్ష్మీనారాయణలకు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ఉత్తర్వులు జారీ చేశారు.



తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలను టీఆర్‌ఎస్‌లో విలీనమైనట్లు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే.



పార్టీ ఫిరాయించిన తమ ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలంటూ మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసినా కూడా, ఇప్పటివరకు వాటిపై నిర్ణయం తీసుకోలేదని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. తమ పార్టీ సభ్యుల విలీనంపై గత నెల 9న మండలి కార్యదర్శి ద్వారా చైర్మన్ విడుదల చేసిన ప్రకటన చట్ట విరుద్ధమని, విలీన ప్రక్రియను చేపట్టే అధికారం చైర్మన్‌కు లేదని వారు వివరించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top