‘బీపీఎస్’ ఉత్తర్వుల సవరణ

‘బీపీఎస్’ ఉత్తర్వుల సవరణ - Sakshi


గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించిన హైకోర్టు

అర్హత లేని వాటిని తేల్చాక చర్యలు తీసుకోవాలని ఆదేశం


సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాల క్రమబద్ధీరణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్) విషయంలో గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు మంగళవారం సవరించింది. బీపీఎస్ కింద వచ్చిన దరఖాస్తుల్లో క్రమబద్ధీకరణకు అర్హత లేని దరఖాస్తులను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని గ్రేటర్ హైదరాబాద్, ఇతర మునిసిపల్ కార్పొరేషన్లను ఆదేశించింది. దరఖాస్తుల తిరస్కరణ ఉత్తర్వులను ఆయా దరఖాస్తుదారులకు అందజే శాక, సదరు అక్రమ నిర్మాణాల విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది.


అర్హత ఉన్న ట్లు తేలిన దరఖాస్తుల విషయంలో ఈ వ్యాజ్యాలు తేలేంత వరకు ఎలాం టి ఉత్తర్వులూ జారీ చేయకుండా పక్కన పెట్టాలని అధికారులకు సూచించింది. దీనిపై పూర్తి వివరాల తో కౌంటర్లు దాఖలు చేయాలని గ్రేటర్, ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణల తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులి చ్చింది.


జీహెచ్‌ఎంసీ పరిధిలోని అక్ర మ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు వీలుగా జీహెచ్‌ఎంసీ చట్టానికి చేసిన సవరణలను, దీని నిమిత్తం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎ.పద్మనాభరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గతంలో దీన్ని విచారించిన కోర్టు బీపీఎస్ కింద వచ్చిన దరఖాస్తులను ప్రాసెస్ చేయవచ్చునని, క్రమబద్ధీకరణ విషయంలో ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.


 ఆ దరఖాస్తులు తిరస్కరించండి...

పిటిషనర్ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వాలు తీసుకొస్తున్న పథకాల పై సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేసిందని గుర్తు చేశా రు. గతంలో బీపీఎస్ తీసుకొచ్చిన ప్రభుత్వం వన్‌టైమ్ స్కీమ్ అని చెప్పిందని, అయితే మళ్లీ మళ్లీ అక్ర మ భవనాలను క్రమబద్ధీకరిస్తూ వెళ్తోందన్నారు. భారీ ఉల్లంఘనలతో చేసిన నిర్మాణాలను సైతం క్రమబద్ధీకరిస్తున్నారని, దీని ద్వారా అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను ఇప్పుడు పూర్తి చేస్తున్నారన్నారు.


దీనికి జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది పి.కేశవరావు స్పందిస్తూ... బీపీఎస్ దరఖాస్తుల  గడువు ముగిసిందని, ఎప్పటి లోపు పూర్తయిన నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తామో దరఖాస్తులో స్పష్టంగా పేర్కొన్నామన్నారు. అలా అయితే ప్రభుత్వం నిర్దేశించిన గడువు ముగి శాక చేపట్టిన నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం పెట్టుకున్న దరఖాస్తులను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసేలా ఆదేశాలివ్వాలని శ్రీనివాస్ ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు అంగీకరిం చిన ధర్మాసనం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top