హార్లీ డేవిడ్సన్ దొంగ అరెస్టు
బంజారాహిల్స్ (హైదరాబాద్): 'నాకు హార్లీ డేవిడ్సన్ బైక్ నడపాలన్న ఆశ ఎప్పటినుంచో ఉంది. డబ్బులు ఇవ్వాలని అడిగితే తల్లిదండ్రులు కాదనడంతో కసి పెంచుకున్నా. ఎలాగైనా ఈ బైక్ నడిపి తీరాలన్న ఉద్దేశంతోనే దొంగతనం చేశా' అని హార్లీ డేవిడ్సన్ బైక్ చోరీ నిందితుడు తొర్లపాటి కిరణ్ తెలిపాడు. సైనిక్పురికి చెందిన తొర్లపాటి కిరణ్ ట్రయల్ రన్ వేస్తానంటూ ఈ నెల 1న బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని హార్లీడేవిడ్సన్ షోరూం నుంచి రూ.6 లక్షల ఖరీదు చేసే బైక్తో పరారైన విషయం తెలిసిందే. అతని కోసం ముంబై వెళ్లిన పోలీసు బృందం కిరణ్ను అదుపులోకి తీసుకోగా, అతన్ని అరెస్ట్ చేసినట్టు శనివారం ప్రకటించారు. వెస్ట్జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
విచారణలో.. గత కొంతకాలం నుంచి తన మానసికస్థితి సరిగా లేదని కిరణ్ వెల్లడించాడు. 'ఓఎన్జీసీ ఉద్యోగినైన నేను ముంబై సముద్ర జలాల్లో 15 రోజులు విధులు నిర్వహిస్తాను. మిగతా 15 రోజులు సెలవులో ఉంటా. రేయింబవళ్లు పని చేయడం వల్ల నిద్రాహారాలు లేక మానసికంగా అనారోగ్యం పాలవుతున్నా' అని అతను చెప్పినట్లు డీసీపీ తెలిపారు. ముంబైలో బైక్ను విక్రయిస్తున్న సమయంలోనే బంజారాహిల్స్ క్రైం పోలీసులు వలపన్ని కిరణ్ను పట్టుకున్నారని డీసీపీ చెప్పారు. నిందితుడి నుంచి బైక్ను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.