చంద్రబాబులో విషసర్పం బుస కొడుతోంది


నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు



హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ పండుగ జరుపుకొనేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధపడుతుంటే మరో వైపు ఏపీ సీఎం చంద్రబాబులోని విషసర్పం బుసలు కొడుతోందని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ విభజనకు వ్యతిరేకంగా జూన్ 2న దీక్షలు చేయమని కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు చెప్పడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని అన్నారు. తెలంగాణ వ్యతిరేకతను చాటుకున్న బాబును నిలదీయాలని టీడీపీ నేతలకు పిలుపునిచ్చారు. అలా వీలుకాకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు నిలబెట్టిన అభ్యర్థిని ఓడించి తీర్పు చెప్పాలన్నారు.



అవసరమైతే రాత్రిపూట ‘మిషన్’ పనులు చేయించండి..

మిషన్ కాకతీయకు సంబంధించి కొత్త పనులను ఆరంభించే ముందు ఈ సీజన్లో పూర్తి చేయగలమో లేదో నిర్ణయించుకోవాలని, ఆ తర్వాతే పనులు చేపట్టాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. ఇప్పటికే ఆరంభించిన పనులను త్వరగా పూర్తి చేయాలని, అవసరమైతే రాత్రి పూట సైతం ఫ్లడ్ లైట్లు పెట్టుకొని పనులు జరిపించాలని ఆదేశించారు. శనివారం ఆయన సచివాలయంలో మిషన్ పనుల పురోగతి, మార్కెటింగ్ శాఖలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొత్తగా తలపెట్టిన గోదాముల నిర్మాణానికి జిల్లాల అధికారులు ప్రభుత్వ భూమిని గుర్తించి యుద్ధప్రాతిపదికన మార్కెటింగ్ డిపోలకు అప్పగించాలని ఆదేశించారు. అంతకుముందు మిషన్ కాకతీయపై పరిశోధన చేస్తున్న అమెరికాలోని మిషిగాన్ యూనివర్సిటీ స్కాలర్స్ మంత్రి హరీశ్‌రావును ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top