బెదిరింపు పార్టీలను సాగ నంపాలి: హరీశ్
నారాయణఖేడ్: బెదిరింపు పార్టీలను సాగనంపాలని భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్లో సోమవారం ఎమ్మార్పీఎస్, యువతతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికలు అణచివేత- అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరాటమన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ బండారం బయటపడుతుందని ఆగమాగమవుతున్నారని విమర్శించారు.
తమ ప్రభుత్వం 80 శాతం రాయితీపై రుణాలు ఇస్తున్నామని, కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింప చేస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. డప్పు- చెప్పు పింఛన్లకు కట్టుబడి ఉన్నామన్నారు. ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూం ఇళ్లను ఇవ్వనున్నట్లు తెలిపారు. యువత నిర్ణయించుకొని ఓటేయాలని కోరారు. దశలవారీగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నామని, ఎస్.ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో నారాయణఖేడ్ పాలకులు గంజాయి స్మగ్లింగ్తో ఎంజాయ్ చేశారని ఆరోపించారు.
సంబంధిత వార్తలు