తెలుగుపై ప్రై‘వేటు’

తెలుగుపై ప్రై‘వేటు’

  • సగం విద్యార్థులకు మాతృభాష రాదు  

  • ఆంగ్లం, గణితంలో మెరుగు

  • స్కూళ్ల పనివేళల్లో ఇష్టారాజ్యం

  • అర్హత లేని గురువులే అధికం

  • ప్రైవేటు బడులపై ఎస్‌సీఈఆర్‌టీ అధ్యయనంలో వెల్లడి

  •  సాక్షి, హైదరాబాద్:

    34.5 శాతం విద్యార్థులకు తెలుగు చదవడం రాదు

    42.9 శాతం స్టూడెంట్లకు చదివినా అర్థం కాదు

    47.6 శాతం మందికి రాయడమే రాదు




     ...ఇదీ ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులకు మాతృభాషైన తెలుగులో ఉన్న పరిజ్ఞానం. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల పనితీరుపై  రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ(ఎస్‌సీఈఆర్‌టీ), డైట్ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర వనరుల గ్రూపు సభ్యులు, ఉపాధ్యాయులు జరిపిన తాజా అధ్యయనంలో ఇలాంటి లోపాలెన్నో బయటపడ్డాయి.



    తెలుగు, ఆంగ్లంలో చదవడం, అర్థం చేసుకోవడం, సొంతంగా రాయడం వంటి అంశాలపై 6,7,8, 10 తరగతుల విద్యార్థుల నైపుణ్యాలను పరీక్షించి చూడగా..ప్రైవేటు బడుల విద్యార్థులు తెలుగు భాషతో పోల్చితే ఆంగ్లంలోనే కొంత మెరుగ్గా ఉన్నారని తేలింది. తరగతి పూర్తయ్యే సరికి విద్యార్థులు కూడికలు, తీసివేతలు, భాగహారాలపై 4వ తరగతిలోనే పట్టు సాధించాల్సి ఉండగా.. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు సైతం వీటిని పూర్తిగా చేయలేకపోతున్నారు. 34 శాతం మంది కూడికలు, 43 శాతం మంది  భాగాహారాలను చేయలేకపోయారు.  

     

    అర్హత లేని బోధకులే ఎక్కువ..



    ప్రైవేటు బడుల్లో అర్హత లేని ఉపాధ్యాయులే ఎక్కువమంది ఉన్నారు. అధ్యయనంలో భాగంగా 10,291 మంది ఉపాధ్యాయుల సమాచారం సేకరించారు. వీరిలో కేవలం 3,384(32.88 %) మంది మాత్రమే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఉత్తీర్ణులై ఉన్నారు. 6,852(66.5%) మంది డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగి ఉంటే, 7,263(70.5%) మంది ఉపాధ్యాయ శిక్షణ పొంది ఉన్నారు. బోధన పద్ధతులు తెలియకపోయినా.. ఇంజనీరింగ్ చదివిన వారు కొన్ని స్కూళ్లలో సైన్స్, గణితం బోధిస్తున్నారు. సుమారు 70 శాతం అధ్యాపకులు పాఠ్యపుస్తకాలను పూర్తిగా చదవలేదు. వారికి తాజాగా అమలులోకి వచ్చిన పరీక్షల సంస్కరణలపై అవగాహన లేదనే చెప్పవచ్చు.

     

    సొంత పాఠ్యాంశాలు.. బరువెక్కిన బ్యాగులు



    కేవలం 24.6 శాతం ప్రైవేటు పాఠశాలల్లోనే 1-5వ తరగతుల కోసం ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను వినియోగిస్తున్నారు. మిగిలిన బడుల్లో ప్రైవేటు ప్రచురణ కర్తల పాఠ్యపుస్తకాలను వినియోగిస్తున్నారు. ఇవి సంబంధిత పాఠశాల సూచించిన షాపుల్లోనే లభ్యమవుతున్నాయి. 6-10 వ తరగతుల కోసం ప్రభుత్వ పాఠ్యపుస్తకాలనే వినియోగిస్తున్నారు. ఒక్కో విద్యార్థి వద్ద పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లతో పాటు 10 నుంచి 15 నోట్ బుక్స్ ఉంటుండడంతో సూల్ బ్యాగులు బరువెక్కుతున్నాయి. ఐఐటీ ఫౌండేషన్ పేరుతో పిల్లల స్థాయికి మించిన అంశాలను బలవంతంగా రుద్దుతున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం కేవలం 22.4 శాతం పాఠశాలల్లోనే గ్రంథాలయం, 24 శాతం పాఠశాలల్లోనే ప్రయోగశాలలున్నాయి.

     

    స్టడీ అవర్స్ పేరుతో...



    విద్యాహక్కు చట్టం ప్రకారం ఒక పాఠశాల వారానికి 45 గంటలే పనిచేయాలి. కేవలం 48 శాతం ప్రైవేటు పాఠశాలలే నిర్దేశించిన పనివేళలను పాటిస్తున్నాయి. చాలా పాఠశాలలు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు, కొన్ని పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేస్తుండగా, కార్పొరేట్ పాఠశాలలు ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేస్తున్నాయి. స్టడీ అవర్స్ పేరుతో టెన్త్ విద్యార్థులను రాత్రి 8 గంటల వరకు పాఠశాలలోనే ఉంచుతున్నారు.

     

    సౌకర్యాలూ అంతంతమాత్రమే...



    కార్పొరేట్ స్కూళ్లు 4, 5 అంతస్తుల భవనాల్లో నిర్వహిస్తుండటంతో విద్యార్థులు అధిక బరువు గల బ్యాగులను మోయలేక  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరగతి గదుల్లో వెలుతురు సైతం రావడం లేదు. కొన్ని స్కూళ్లను రేకుల షెడ్లలో నిర్వహిస్తుండడంతో విద్యార్థులు తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు. 85 శాతం ప్రైవేటు బడుల్లో మూత్రశాలలున్నా విద్యార్థులకు సరిపడ సంఖ్యలో లేవు. పది తరగతులకు గాను కేవలం 2, 3 మూత్రశాలలే ఉంటున్నాయి. అవీ నిర్వహణకు నోచుకోక అపరిశుభ్రంగా ఉంటున్నాయి. దాదాపు 90 శాతం పాఠశాలలకు ఆట స్థలాలు లేవు.

     

    అధ్యయనం జరిగిందిలా...



    ప్రతీ జిల్లా నుంచి సగటున 40 ప్రైవేటు పాఠశాలల వంతున తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల పరిధిలోని 442 ప్రైవేటు బడుల్లో 10,291 మంది ఉపాధ్యాయులతో కూడిన ఎస్‌సీఈఆర్‌టీ బృందం పరిశోధన జరిపింది. వీటిలో 367 ఆంగ్ల, 73 తెలుగు, 2 ఉర్దూ మాధ్యమ పాఠశాలలున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని సాధారణ ప్రైవేటు పాఠశాలలతో పాటు ప్రముఖ కార్పొరేట్ స్కూళ్లనుకూడా అధ్యయనం కోసం ఎంపిక చేసుకున్నారు. ప్రశ్నావళులు, ఇంటర్వ్యూలు, ప్రత్యక్ష పరిశీలన, రికార్డుల పరిశీలన, గ్రూప్ డిస్కషన్ తదితర పద్ధతులను వినియోగించి ఈ అధ్యయనం చేశారు.

     

    ఫీ‘జులుం’ ఎక్కువే !

     

    ప్రైవేటు బడుల్లో ఫీజుల వసూళ్లపై నిర్దిష్ట విధానం లేదు. ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా వసూలు చేస్తున్నారు. మండల స్థాయిలో కంటే జిల్లా కేంద్రాల్లో, అక్కడి కంటే రాష్ట్ర రాజధానిలో మరీ ఎక్కువగా వసూలు చేస్తున్నారు. గరిష్టంగా హైదరాబాద్‌లో 10వ తరగతి(డే- స్కాలర్)కి రూ.45 వేలు వరకు వసూలు చేస్తున్నారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో దీనికి అదనంగా నెలకు రూ.2 నుంచి రూ.3 వేలు అవుతోంది. సాధారణ ఉన్నత పాఠశాలలతో పోల్చితే కాన్సెప్ట్ స్కూళ్లలో ఎక్కువ. వాటికంటే టెక్నో స్కూళ్లలో, టెక్నో స్కూళ్ల కంటే ఈ-టెక్నో స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. తెలుగుతో పోల్చితే ఆంగ్ల మాధ్యమ స్కూళ్లలోనే ఫీజులు అధికం.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top