సహకార సంఘాలకు గ్రేడింగ్
కరీంనగర్ రూరల్ : జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పనితీరును అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రేడింగ్ విధానం అమలు చేస్తోంంది. జిల్లాలో నాలుగు డివిజన్లలో 134 సహకార సంఘాలున్నాయి. ఎరువుల విక్రయాలు, మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లు, రుణాల మంజూరీ, వసూళ్లు చేస్తూ సంఘాలు ముందంజలో ఉన్నాయి. ప్రభుత్వం గ్రాంట్ విడుదల చేసేందుకు అర్హత కలిగిన సంఘాలను గుర్తించడానికి గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
మొత్తం 22 అంశాల్లో సంఘాలు సాధించిన ప్రగతి ఆధారంగా మార్కులు వేసి గ్రేడింగ్ నిర్ణయిస్తారు. దీని ప్రకారం ఏ+గ్రేడ్లో రాయికల్, సుల్తానాబాద్ ప్రాథమిక సంఘాలున్నాయి. ఏ గ్రేడ్లో 16 సంఘాలు, బీ+ గ్రేడ్లో 39, బీ గ్రేడ్-38, సీ+ గ్రేడ్లో 21 సంఘాలు, సీ గ్రేడ్లో 16 సంఘాలు, డి గ్రేడ్లో రెండు సంఘాలున్నాయి. ఏ+, ఏ, బీ+, బీ గ్రేడు పొంది ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి అక్రమాలకు పాల్పడని సంఘాలు ప్రభుత్వం నుంచి గ్రాంట్ మంజూరీకి అర్హత పొందుతాయని జిల్లా సహకార అధికారి చంద్రప్రకాశ్ తెలిపారు.