సర్కారీ స్కూళ్లపై.. నిఘా


సాక్షి, కరీంనగర్ : గాడి తప్పుతున్న విద్యా వ్యవస్థను దారిలో తెచ్చేందుకు జిల్లా విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. సమయపాలన పాటించని ఉపాధ్యాయులు.. ప్రణాళికలు లేని చదువులు.. పడిపోతున్న విద్యాప్రమాణాలు.. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు విద్యాశాఖను అప్రతిష్టపాలు చేస్తున్నాయి. కనీసం చదవడం, రాయడం కూడా రాని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో వేల  సంఖ్యలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వ పాఠశాలల మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి. ప్రజల్లో నమ్మకం సన్నగిల్లకుండా.. సమస్యలు అధిగమించాలంటే కఠినంగా వ్యవహరించక తప్పదని భావించిన జిల్లా విద్యాశాఖాధికారి కె.లింగయ్య పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

 

  ప్రతీరోజు రెండు, మూడు మండలాల పరిధిలో ఉన్న ప్రధానోపాధ్యాయులతో సమావేశమై సమస్యలు.. విద్యార్థుల సామర్థ్యాలపై ఆరా తీస్తున్నారు.

 

 సోమవారం స్థానిక  పురాతన బాలుర ఉన్నత పాఠశాలలో కరీంనగర్ అర్బన్, తిమ్మాపూర్, బెజ్జంకి పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నాలుగు గంటల పాటు సమావేశమై... సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారికి దిశానిర్దేశం చేశారు.

 

  ఇకపై ప్రతి నెలా 20 రోజులు తమ పరిధిలోని పాఠశాలలో ప్రార్థనకంటే ముందే హాజరుకావాలని జిల్లా ఉప విద్యాధికారులు, మండల విద్యాధికారులు, సర్వశిక్ష అభియాన్ కార్యాలయ సెక్టోరల్ అధికారులను ఆదేశించారు. ప్రార్థన ముగిసిన తర్వాత.. మారిన పరీక్ష సంస్కరణలకు అనుగుణంగా పాఠశాలలో విద్యా బోధన జరుగుతుందా.. ? లేదా? తెలుసుకోవాలన్నారు.

 

 ఉపాధ్యాయులు యూనిట్ ప్రణాళికలు రాస్తున్నారా? లేదా? తెలుసుకోవాలి. విద్యార్థులెవరూ గైడ్లపై ఆధారపడకుండా చర్యలు తీసుకోవాలి. ఫార్మటివ్ అసెస్‌మెంట్ 1, 2 పరీక్షలు నిర్వహణ, పేపర్ల దిద్దుబాటు, ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారా? లేదా? తెలుసుకోవాలి.

 

 ప్రతి రోజు ఉపాధ్యాయులు విద్యార్థులకు రాత పని ఇవ్వాలి. ఇంటి వద్ద రాత పని చేసుకొస్తున్నారా? లేదా? చూడాలి.

 

 నవంబ ర్ 14.. వరకు ఒకటి నుంచి పదో తరగతి వరకు అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ రాయడ ం, చదవడం రావాలి. ఆ బాధ్యత సంబంధిత ఉప, మండల విద్యాధికారులు. ప్రధానోపాధ్యాయులదే. చదవడం, రాయడం రాని విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక రికార్డు మెయింటేన్ చేయాలి. వారానికోసారి ఆ విద్యార్థుల పురోగతిపై ఉప విద్యాధికారులకు నివేదించాలి. గడువు దాటిన తర్వాత.. విద్యార్థుల చదువు సామర్థ్యాలు తెలుసుకునేందుకు జిల్లాకు రాష్ట్ర పరిశీలనృబందాలు రానున్నాయి. విద్యార్థులు చదువులో వెనకబడినట్లుృబందాలు తేల్చితే సంబంధిత హెచ్‌ఎంలపై చర్యలు తప్పవని డీఈవో హెచ్చరించారు.

 

 ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడింది. ఇకపై ప్రతి పాఠశాలను పర్యవేక్షించేలా.. జిల్లా పరిధిలోని కరీంనగర్, జిల్లా పరిషత్, పెద్దపల్లి, హుజూరాబాద్, సిరిసిల్ల, జగిత్యాల ఉప విద్యాధికారులకు వాహన వసతి కూడా కల్పించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top