బంగారు తెలంగాణలో భాగస్వాములవుదాం


కరీంనగర్ సిటీ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన తరహాలోనే కొత్తగా ఏర్పడిన రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ భాగస్వాములమవుదా మని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. చీఫ్ విప్‌గా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారి కరీంనగర్ వచ్చిన ఆయన శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఓ సైనికుడిలా పనిచేశానన్నారు. తెలంగాణ ఉద్యమానికి జిల్లా ఆయువుపట్టు లాంటిదని, జిల్లాకు ఎన్ని బాధ్యతలిచ్చినా తక్కువేనని అన్నారు. జిల్లాకు ఇప్పటికే ఇద్దరు మంత్రులున్నారని, మరికొన్ని కేబినెట్ స్థాయి పదవులు ఇచ్చారని, ఇంకా ఇస్తారని తెలిపారు. పదవులు పొందిన నేతలంతా పునర్నిర్మాణంలో ముందువరుసలో ఉండాలన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ.. 2001 నుంచి రాష్ట్రం సాధించేవరకూ కీలక భూమిక పోషించిన కొప్పుల ఈశ్వర్‌కు కేసీఆర్ సముచితస్థానం కల్పించారన్నారు.

 

 ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. కొప్పుల చీఫ్‌విప్‌తోనే సంతృప్తి పడాల్సిన అవసరం లేదని, రానున్న రోజుల్లో ప్రజలే మరిన్ని పదవీ బాధ్యతలు అప్పగిస్తారన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. జిల్లాకు తొలిసారి చీఫ్‌విప్ పదవి రావడం సంతోషకరమన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, జెడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, జెడ్పీటీసీలు తన్నీరు శరత్‌రావు, సిద్దం వేణు, ఎడ్ల సుగుణాకర్, ఎడ్ల శ్రీనివాస్, కందుల సంధ్యారాణి, ఇప్పనపల్లి సాంబయ్య, వీరేశం, లచ్చిరెడ్డి, సంజీవరెడ్డి, ఎంపీపీ వాసాల రమేశ్, పార్టీ నాయకులు కోరుకంటి చందర్, కాశెట్టి శ్రీనివాస్, ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జమీలొద్దిన్, కటారి రేవతిరావు, తిరుపతినాయక్ పాల్గొన్నారు.

 

 ఘన స్వాగతం

 చీఫ్‌విప్‌గా బాధ్యతలు చేపట్టి తొలిసారి జిల్లాకు వచ్చిన ఈశ్వర్‌కు పార్టీ శ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది. శనిగరం వద్ద జెడ్పీటీసీ శరత్‌రావు ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. అక్కడి నుంచి కొప్పుల భారీ వాహనాల కాన్వాయ్‌తో వచ్చారు. అల్గునూరు వద్ద కార్పొరేటర్లు వై.సునీల్‌రావు, బోనాల శ్రీకాంత్, బండారి వేణు, నాయకులు చల్ల హరిశంకర్, మోతె గంగారెడ్డి, వొంటెల సత్యనారాయణరెడ్డి స్వాగతం పలికారు. జెడ్పీలో చైర్‌పర్సన్ తుల ఉమ, ఎంపీ బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్ కొప్పులను సత్కరించారు. మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు కనకరాజ్ స్వాగతం పలికారు. విద్యార్థినేత జె.నాగరాజు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

 

 పోలీసుల సమన్వయం లోపం

 ఈశ్వర్‌ను జెడ్పీలోకి తీసుకురావడంలో పోలీ సుల వైఫల్యం మరోసారి బయటపడింది. జెడ్పీ బస్టాండ్ వైపు ప్రధాన ద్వారాన్ని  కొంతకాలంగా వాడడంలేదు. పడమటి వైపు ఉన్న ద్వారం నుంచే రాకపోకలు కొనసాగిస్తున్నారు. పోలీసులు ఈశ్వర్‌ను నేరుగా బస్టాండ్ ఉన్న గేట్ వైపు తీసుకెళ్లారు. గేట్‌కు తాళం వేసి ఉండడంతో ఆయన ఐదు నిమిషాలు వేచిచూడాల్సి వచ్చింది. చివరకు మళ్లీ పడమటి వైపు గేట్‌నుంచి లోనికి తీసుకొచ్చారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top