గోవా టు నల్లగొండ


 భువనగిరి : గోవా టు తెలంగాణ.. అందులోనూ  నల్లగొండ.. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ నకిలీ మోనోగ్రామ్స్‌తో భారీగా నాన్‌డ్యూటీ పెయిడ్ (ఎన్‌డీపీ) మద్యం తరలివస్తోంది. ఇటీవల జిల్లాలో ఎన్‌డీపీ అమ్మకాలు జరుపుతున్న ముఠాను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో తీగ లాగి తే డొంకంతా కదులుతోంది. గోవా నుంచి కర్ణాటక మీదుగా సాగుతున్న ఎన్‌డీపీ మద్యం తెలంగాణలోని నల్లగొండతోపాటు పలు జిల్లాల్లో అమ్ముతున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం జిల్లాలోని రాజాపేట, యాదగిరి గుట్ట, రఘునాథపురం మద్యం దుకాణాల్లో పట్టుబడిన నాన్‌డ్యూటీ పెయిడ్ ఆఫీసర్స్ చాయస్ మద్యం వెనక భారీ కుంభకోణం దాగి ఉందని తెలుస్తోంది.

 

 ఇంతకుముందు హైదరాబాద్, గోవా కేంద్రంగా తయారవుతున్న ఈ మద్యం కర్ణాటక మీదు గా తెలంగాణ జిల్లాలకు సరఫరా అవుతోంది. మద్యం దుకాణాల్లో పనిచేస్తూ నాలుగు డబ్బులు సంపాదించిన వ్యక్తులు కింది స్థాయిలో ఈ అక్రమ వ్యాపారంలో భాగస్వాములైనట్లు ఎక్సైజ్ పోలీసుల విచారణలో తేలింది. కర్ణాటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు తెలంగాణలోకి ఎన్‌డీపీ మద్యం రవాణా చేస్తున్నాడు. అయితే ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కొంతకాలంగా నిఘా పెట్టడంతో ఎట్టకేలకు సంక్రాంతి పండగరోజు అసలు  విషయం బయటపడింది. ఈ కేసులో ప్రధాన నిం దితులను అదుపులోకి తీసుకున్న పోలీ సులు ముమ్మరంగా విచారణ చేస్తున్నారు.

 

 గోవా నుంచి కర్ణాటక.. అటు నుంచి తెలంగాణలోకి

 పోలీసుల విచారణలో తెలిసిన సమాచారం మేరకు.. ఎన్‌డీపీ మద్యం గోవా డిస్టిలరీల నుంచి వస్తోంది. హైదరాబాద్, మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం వ్యాపారంలో ఉన్నారు. వారిలో ఒకరి బంధువు మంజునాథ్ కర్నాటకలోని హుమ్నాబాద్‌లో ప్రముఖ వ్యాపారి, ఓ పార్టీకి చెందిన ఇతను గోవా నుంచి ఎన్‌డీపీ మద్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి  తెలంగాణలోకి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగి రెండు నెలల సమయంలో ఆఫీసర్స్ చాయిస్  హోలోగ్రామ్ ముద్రించిన బాటిళ్లపై అనుమానం వచ్చింది. వీటిపై ఉన్న బ్యాచ్‌నంబర్ కూడా మల్కాజిగిరిలోని ఓ డిస్టిలరీకి సంబంధించినదిగా ఉంది. దీంతోపాటు జహీరాబాద్ ప్రాంతంలో ఆప్‌టెక్ (మద్యం దుకాణదారుల టార్గెట్) తగ్గుతూ వచ్చింది. డూప్లికేట్ హోలోగ్రామ్‌తో మద్యం అక్రమ రవాణ జరుగుతుందని భావించిన అధికారులు నిఘా పెంచారు. గత ఏడాది ఆగస్టు16న బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ట్రాన్స్‌పోర్ట్ వాహనంలో రాయిచూర్ సమీపంలోని బసవకళ్యాణి వద్ద 8 వందల పెట్టెల ఆఫీసర్ చాయిస్ ఎన్‌డీపీ బాటిళ్లను గుర్తించారు.

 

 వైన్స్‌కు వచ్చేసరికి రూ.2,600

 నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లను ఒక కేసుకు మద్యం దుకాణం దరకు వచ్చే సరికి రూ.2,600 లభిస్తుంది. గోవా నుంచి ఒక కేసు మద్యం బాటిళ్లను రూ.1500లకు కొ నుగోలు చేసిన కర్ణాటకు చెందిన ఓ వ్యా పారి తన ఏజెంట్ల ద్వారా అమ్మకాలు సాగి స్తున్నాడు. గోవాకు చెందిన ఇమ్రాన్, ఆరీ స్‌లు గోవా డిస్టిలరీల నుంచి మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

 

 నకిలీ హోలోగ్రామ్‌పై ప్రభుత్వ ముద్ర

 ఎన్‌డీపీ మద్యంపై ఉన్న నకిలీ హోలోగ్రామ్‌పై ప్రభుత్వం ముద్ర ఉంది. ఎన్‌పోర్స్‌మెంట్ అధికారులు విచారణ చేపట్టగా అది అప్రూవ్‌డ్‌బై గవర్నమెంట్ ఉంది. హోలోగ్రామ్‌పై విచారణ చేపట్టగా మల్కాజిగిరి డిస్టిలరీకి చెందిన మ్యాక్‌డెవల్ బ్రాండ్‌కు ఇచ్చిన హోలోగ్రామ్ నంబర్ ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం రాకముందే దానికి సంబంధించిన హోలోగ్రామ్ ప్రింట్ చేశారని సమాచారం.

 

 గోవా నిందితుల కోసం కొనసాగుతున్న వేట..

 ఎన్‌డీపీ మద్యం ఎక్కడినుంచి వస్తుందన్న విషయంలో ఎక్సైజ్ పోలీసులు తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం వేట కొనసాగుతోంది. కర్ణాటకకు చెందిన ఓ వ్యాపారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మద్యం సరఫరా చేస్తున్న గోవాకు చెందిన వ్యాపారులను అరెస్ట్ చేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు గోవా డిస్టిబ్యూటరీల నుంచి వస్తున్న మద్యం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలకు సరఫరా అవుతుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top