అందంగా లేనని.. యువతి ఆత్మహత్య

అందంగా లేనని.. యువతి ఆత్మహత్య - Sakshi


ఖమ్మం: పదేళ్లుగా చర్మవ్యాధితో బాధపడుతున్న ఓ యువతి తనను ఎవరూ వివాహం చేసుకోరేమోననే బాధతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మంలో జిల్లాలోని గార్ల మండలం మద్దివంచకు చెందిన మాచర్ల వెంకన్న పిల్లల చదువుల కోసమని కొంతకాలం కిందట కుటుంబంతో కలిసి పట్టణానికి వచ్చి గట్టయ్య సెంటర్లో నివాసం ఉంటున్నారు. వెంకన్న ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పని  చేస్తున్నాడు. భార్య పద్మ చిన్న చిన్న పనులు చేస్తుండగా శిరీష(18) స్థానిక ప్రయివేట్ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతుండగా, కుమారుడు శ్రీకాంత్ ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు.



శిరీష  పదేళ్లుగా చర్మవ్యాధితో బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా నయం కాకపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనైంది. దీంతో ఆమె మనస్తాపానికి గురైంది. మంగళవారం సాయంత్రం ఎవరికీ చెప్పకుండా బయకటు వచ్చింది. రాత్రి అయినా శిరీష  తిరిగి రాకపోయేసరికి కంగారుపడిన ఆమె సోదరుడు ఫోన్ చేయగా ఆమె ఫోన్ ఎత్తలేదు.  'అన్నయ్యా.. అమ్మను బాగా చూసుకో.. నాన్న జాగ్రత్త.. ఇక నేను ఎప్పటికీ మీకు కనపడను. మళ్లీ జన్మంటూ ఉంటే మీ కుటుంబంలోనే పుట్టాలని ఆ దేవున్ని కోరుకుంటా' అని సోదరుడికి మెసేజ్ పెట్టింది.



దాంతో శిరీష సోదరుడు తిరిగి రమ్మని ఎక్కడ ఉన్నావని మెసేజ్లు పంపినా రిప్లయ్ లేదు. ఆ తర్వాత సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన ఆమె.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు శిరీష మృతదేహాన్ని మార్చరికీ తరలించారు. అంతలో ఆమె కుటుంబ సభ్యులు వెతుక్కొంటూ రైల్వే ప్లాట్ఫాంపై తిరుగుతుండగా పోలీసులు ప్రశ్నించగా వారు విషయం తెలిపారు. దాంతో వారికి శిరీష మృతదేహాన్ని చూపించగా గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top