ఇంట్లో ఉంటే మమ్మల్నీ చంపేవాడు: గాయత్రి తండ్రి
యాదగిరిగుట్ట: తమ కుటుంబంలో విషాదం నింపిన ఉన్మాది శ్రీకాంత్ను కఠినంగా శిక్షించాలని గాయత్రి (20) తండ్రి సూదగాని సాయిలు కోరుతున్నారు. కూతురి మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన ఆయన 'సాక్షి'తో మాట్లాడారు. తన కూతురు గాయత్రి పెళ్లి కోసం డబ్బు కూడబెట్టామన్నారు. మేం ఇంట్లో లేని సమయంలో శ్రీకాంత్ తమ అమ్మాయిని హత్య చేశాడని చెప్పారు. మేం ఇంట్లో ఉంటే మమ్మల్ని కూడా చంపేవాడని, ఈ ఘాతుకానికి పాల్పడేందుకు శ్రీకాంత్కు అతడి స్నేహితులు సహకరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
యాదగిరిపల్లికి చెందిన సూదగాని సాయిలు– లక్ష్మి దంపతుల కుమార్తె గాయత్రి గతేడాది డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్న గాయత్రికి ఇదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వేధించడం మొదలుపెట్టాడు. అతడంటే ఇష్టం లేదని, ఈ విషయాన్ని పలుమార్లు శ్రీకాంత్కు చెప్పి చూసినా ప్రయోజనం లేకపోవడంతో విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. ఆమె తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు కూడా పలుమార్లు ప్రేమోన్మాది శ్రీకాంత్ను మందలించారు. ఈ క్రమంలో గాయత్రికి ఓ పెళ్లి సంబంధం కుదిరింది. నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి గాయత్రిపై కత్తితో దాడి చేశాడు. భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే గాయత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే.