మనసున్న ‘మహారాజు’

మనసున్న  ‘మహారాజు’ - Sakshi


అనాథ నుంచి అనాథశ్రమం వరకు..

దిక్కులేనివారికి ‘మహిమ మినిస్ట్రీస్’తో

పెద్దదిక్కుగా..   ప్రశంసలు అందుకుంటున్న ఆర్‌డీ మహారాజు


 

‘‘చీకటి పడుతున్న వేళ ఓ చిన్నారిని ఎత్తుకుని ఓ యువతి ఆ ఆశ్రమానికి చేరుకుంది. నవమాసాలు మోసి కన్న కూతురికి నయంకాని రోగం ఉందని.. తనకు వివాహాం కాలేదని.. ఆ పసికందును చెత్త కుప్పలో పారవేయలేనంటూ ఆ ఆశ్రమంలో వదిలేసి వెళ్లింది.’’

 

‘‘మరో పాపపేరు మమిశ. పుటుకతోనే గుడ్డి. అందురాలు అని కన్నవారు సైతం వదిలించుకుంటే ఆ చిన్నారి ఏడుపు విన్నవారు ఇక్కడికి తీసువచ్చి వదిలేశారు.’’

 

ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరిది ఒక్కో గాథ. కావాలని కన్నవారు పేగుబందాన్ని తెంచుకోవడంతో అనాథలుగా మారిన వారే. వారి కష్టాలను గుర్తెరిగిన ఓ అనాథ తాను చిన్నతనంలో పడిన కష్టాలు వారికి రాకుడదని తలంచాడు. ఆస్తులు కూడబెట్టకున్నా.. అనాథలను చేరదీసి ఆత్మబంధువుగా మారాడు. మహిమ మినిస్ట్రీస్ అనే అనాథశ్రమాన్ని స్థాపించి వారికి పెద్దదిక్కుగా నిలిచాడు మంచి మనస్సున్న ఈ మహారాజు.

 - పటాన్‌చెరు

 

 పటాన్‌చెరు మండలం అమీన్‌పూర్‌లోని మహిమ మినిస్ట్రీస్ జిల్లా అంతటా ప్రాచుర్యం పొందిన అనాథశ్రమం. ఈ ఆశ్రమ నిర్వాహకుడు రేవు ధర్మాంగద మహారాజు ఓ అనాథ. పీజీ వరకు చదువుకున్న మహారాజు ఎన్నో కష్టాలు, ఛీదరింపులు.. చీత్కారాలను అనుభవిస్తూ ఎదిగారు. తాను పడిన కష్టాలు అనాథలుగా సమాజంలో ఏ ఒక్కరు పడకుడదనుకున్నాడు. అనుకున్నదే తడవుగా చదువులకు పులిస్టాఫ్ పెట్టాడు. ఆరేళ్ల క్రితం అమీన్‌పూర్ నరేంద్రనగర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని మినిస్ట్రీస్ అనే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి అనాథలను చేరదీస్తున్నాడు. వందలాది దిక్కులేని వారికి ఆసరాగా నిలుస్తున్నాడు. అనునిత్యం ఆశ్రమంలోని పిల్లల పెంపకంపైనే ఆయన దృష్టి ఉంటుంది. ప్రతి రోజు వారి భోజనాలు, బట్టలు కోసం చేస్తున్న కృషి ఓ యజ్ఞం వంటిదే. చందాల పేరుతో ఆయన ఏనాడు ఎవ్వరినీ యాచించలేదు. ప్రభుత్వం పథకాల కోసం చింతించలేదు. ఒక్క దరఖాస్తు కూడా పెట్టుకోలేదు. ఆశ్రమంలో జరుగుతున్న సేవ, అక్కడి పరిస్థితి తెలుసుకున్న మానవతావాదులు ఆ పిల్లలకు ఆహారం ఇస్తూ వచ్చారు.  



 దాతలసాయంతో..

 మహిమ మినిస్ట్రీస్ సంస్థలో 131 మంది పిల్లలు ఉన్నారు. అదే సంస్థలో ప్రభుత్వ అనుమతి తీసుకుని పిల్లలకు చదువులు చెప్పిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కొందరు ప్రతి శని, ఆదివారాల్లో ఆశ్రమానికి వచ్చి తమ వంతు సహాయంగా సమయాన్ని వెచ్చిస్తున్నారు. పిల్లలతో ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేస్తున్నారు. అలాగే అనాథలుగా ఆశ్రమంలో అడుగుపెట్టిన వారిలో కొందరు శాశ్వతంగా ఇక్కడే ఉంటూ సేవలందిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. మరోవైపు పటాన్‌చెరు ప్రాంతంలోని చాలా మంది రాజకీయవేత్తలు, ఇతర సంస్థలు ప్రతినిధులు ఆ ఆశ్రమంలో తమ పుట్టిన రోజు, పెళ్లి రోజుల వేడుకలను నిర్వహిస్తున్నారు. వారికి తోచిన విధంగా అనాథలకు సహాయం చేస్తున్నారు. డెల్లాయిట్ సహాకారంతో ఆశ్రమంలో పిల్లల ఆవాసం కోసం భవంతుల నిర్మాణం చేపడుతున్నారు. ఇంకా కొన్ని సౌకర్యాలు పిల్లలను వేధిస్తున్నాయి. ప్రధానంగా ఆశ్రమంలో స్నానపు గదులు, ఇతర వసతులకు కొరతగా ఉంది. ‘అన్నా పిల్లలు పెద్దవాళ్లయారన్న.. వారికి ఇప్పుడున్న గదలు చాలడంలేదు. ఆడపిల్లలకు, మగపిల్లలకు వేర్వేరు గదులు కావాలన్నా’ అంటూ తన తపన ను ఆయనను కలిసిన వారితో పంచుకుంటున్నారు మహారాజు.

 

 అభినందనీయం

 ముస్కాన్ కార్యక్రమం కింద వీధిబాలలను, బాలకార్మికులను గుర్తించి మహిమ మినిస్ట్రీస్‌లో చేర్చుతున్నాం. ఈ ఆశ్రమంలో పిల్లలకు మంచి సేవలు అందుతున్నాయి. ప్రతి ఒక్కరూ అనాథ బాలబాలికలకు అండగా ఉండాలి.                         

 - అరుణ, న్యాయవాది, ఎల్‌పీఓ,

 ఇంటిగ్రేటడ్ చైల్డ్ ప్రొటెక్షన్ పొసైటీ సంగారెడ్డి

 

 ఆశ్రమం బాగుంది

 ఆశ్రమంలో కొంతకాలంగా ఉంటున్నా. తొమ్మిదో తరగతి చదువుతున్నా. మాకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకుంటున్నారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆశ్రమం మాకు అమ్మవడిలాంటిది.       - రవి, విద్యార్థి, మహిమ మినిస్ట్రీస్

 

 తృప్తిగా ఉంది

 ఎన్నోకష్టాలు పడుతున్నా. అయినా చిన్నారుల సంరక్షణతో అవన్నీ మరిచిపోయి ఎంతో తృప్తిగా ఉంది. వారికి మంచి విద్యాబుద్దులు నేర్పించి, ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నా. ఆస్తులు లేకపోయినా సేవకు అంకితమైన నాకు దాతలనుంచి అందుతున్న యూతనకు, వారి దాతృత్వ గుణానికి కృతజ్ఞతలు.

 -ఆర్‌డీ మహారాజు, మహిమ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top