పూర్వ కమిషనర్‌పై చర్యలు


 నల్లగొండ టుటౌన్  :ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన నల్లగొండ మున్సిపాలిటీ పూర్వ కమిషనర్‌పై లోకాయుక్త ఆగ్రహం వ్యక్తం చేసింది. అయిన వారి కోసం నిబంధన లు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన సదరు ఉద్యోగిపై  చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ  జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. 2010 వరకు ఇక్కడ మున్సిపల్ కమిషనర్‌గా పని చేసిన ఎం.వెంకటేశ్వర్లు ప్రకాశం బజారులోని కూరగాయల మార్కెట్  కోసం నిర్మించిన దుకాణ సముదాయాన్ని వ్యాపారులకు కేటాయించడంలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగం ఎదర్కొంటున్నారు.

 

 అర్హులైన తమకు దుకాణాలు కేటాయించకుండా కమిషనర్ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఇద్దరు వ్యాపారులు లోకాయుక్తను ఆశ్రయిం చారు. దీంతో ఆరు నెలల క్రితం మున్సిపల్ రీజినల్ డెరైక్టర్ విచారణ జరిపి నివేదికను కోర్టుకు అందజేశారు. పూర్తి వివరాలను పరిశీలించిన కోర్టు వెంకటేశ్వర్లుపై చర్యలకు ఆదే శించింది. 140 దుకాణాల్లో  15 దుకాణాలను ఒకే కుటుం బంలో నలుగురికి, ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించినట్లు విచారణలో తేలింది. గతంలో న్యూప్రేంటాకీస్ స్థలం విషయంలోనూ హైకోర్టు ఈయనపై మొట్టికాయలు వేసిన విషయం తెలి సిందే. వెంకటేశ్వర్లు ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో పని చేస్తున్నట్లు తెలిసింది.

 

 దుకాణాల కేటాయింపే విరుద్ధం

 ప్రకాశం బజారులో కూరగాయల వ్యాపారుల కోసం మున్సిపాల్టీ ఆధ్వర్యంలో దుకాణాల సముదాయాన్ని నిర్మించారు. వీటి కేటాయింపులో అర్హులైన చిరు వ్యాపారులకు కాకుండా బడా వ్యాపారులకు పెద్ద పీట వేశారు. మొత్తం 140 దుకాణాలలో అనర్హులకే ఎక్కువగా ఇచ్చారని పలువురు వ్యాపారులు అప్పట్లో ఆందోళన కూడా చేశారు. ఓ బడా వ్యాపారి తన కుటుంబ సభ్యుల పేరు మీద నాలుగు దుకాణాలను దక్కించుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం కేటాయించడంతో దుకాణాలు దక్కని వారు లోకాయుక్తను ఆశ్రయించారు. కొంత మంది మూడు నాలుగు దుకాణాల మధ్య ఉన్న గోడలను కూల గొట్టి ఒకే దుకాణంగా నిర్వహిస్తున్నా  అధికారులు నోరుమెదపడం లేదు. దుకాణా ల కేటాయింపు కూడా బహిరంగ వేలం ద్వారా కాకుండా అప్పటి అధికార పార్టీకి చెందిన వారు చెప్పిన విధంగా చేశారనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి.  

 

 వేలానికి ఏర్పాట్లు

 ప్రకాశం బజారులో ఉన్న కూరగాయల మార్కెట్ సముదాయాన్ని బహిరంగ వేలం ద్వారా వ్యాపారులకు కేటాయించేందుకు మున్సిపల్ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇద్దరు, ముగ్గురు వ్యాపారుల గుత్తాధి పత్యానికి చెక్ పెట్టడానికి కోర్టు తీర్పు మున్సిపాల్టీకి అనుకూలంగా మారింది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top