సోనియా కృషిని విస్మరిస్తారా?: ఉత్తమ్
హైదరాబాద్: పదో తరగతి సాంఘికశాస్త్రంలో తెలంగాణ ఉద్యమ చరిత్రను, పోరాటాలను, అమరుల త్యాగాలను ప్రభుత్వం వక్రీకరించిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. పార్టీ నేతలు మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ, శ్రవణ్, ఉద్దెమర్రి నరసింహారెడ్డితో కలసి బుధవారం ఆయన గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ రాబోయే విద్యా సంవత్సరానికి 22వ పాఠ్యాంశంగా చేర్చిన 14 పేజీల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వంత డబ్బా కొట్టుకున్నారని విమర్శించారు. తెలంగాణకోసం అమరులు చేసిన త్యాగాలు, పోరాటాలు, కాంగ్రెస్పార్టీ చేసిన ప్రయత్నాలేమీ ఆ పాఠ్యాంశంలో లేవన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ పేరును ప్రస్తావించకపోవడం దారుణమని ఉత్తమ్ విమర్శించారు.
సోనియాగాంధీ కృషి, పట్టుదలతోనే తెలంగాణ వచ్చిందని, పాఠ్యాంశంలో సోనియాగాంధీ కృషి గురించి కూడా ఉంటుందని సీఎం కేసీఆర్ గతంలో చెప్పిన విషయాన్ని టీపీసీసీ నేతలు గుర్తుచేశారు. దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని వారు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా బోఫోర్సు కుంభకోణంలో రాజీవ్ గాంధీని విమర్శించిన వారు ఏ పార్టీలో ఉన్నా అందరూ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి డిమాండ్ చేశారు.
నెహ్రూకు నివాళి
దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి కార్యక్రమాన్ని గాంధీభవన్లో నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, నేతలు షబ్బీర్ అలీ, వి.హనుమంతరావు, మహేశ్కుమార్ గౌడ్, కుమార్రావు తదితరులు నెహ్రూకు నివాళులర్పించారు.