ఏప్రిల్ నుంచి రైతు కార్డులు

ఏప్రిల్ నుంచి  రైతు కార్డులు - Sakshi


మార్చి ఆఖరు నాటికి సర్వే పూర్తి

ఇసుక తవ్వకాలతో స్థానికులకు లబ్ధి  సీఎం హామీలపై దృష్టి

‘పది’ ఫలితాల కోసం ప్రత్యేక శిబిరాలు


 

కలెక్టర్‌గా వాకాటి కరుణ తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలులో స్తబ్దతను తొల గించారు. గతంలో జిల్లాలో జేసీగా పనిచేసిన అనుభవంతో రెవెన్యూశాఖ పరంగా రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రయత్నిస్తున్నారు. వ్యక్తిగత పనులపై మార్చి 2 నుంచి 15 వరకు వెళ్తున్న కలెక్టర్ ఆదివారం ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడారు. సీఎం హామీల అమలు తీరు, ఇసుక క్వారీల కేటాయింపు, పరిపాలన పరంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు.



వరంగల్పహాణీలు, పాస్‌పుస్తకాల కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. అన్నదాత తన భూమి వివరాల కోసం అధికారుల చుట్టూ తిరగడం.. వారిని తిప్పుకోవడం దురదృష్టకరం. అధికారుల ఆలోచన విధానంలో మార్పురావాలి. సాంకేతిక పరమైన అంశాల వల్ల సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుతం అధికారులు అంతా కొత్తవారు వచ్చారు. పరిస్థితులు తప్పకుండా మారుతాయి. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేయాలి. ఈ విషయంలో ఇప్పటికే జిల్లా అధికారుల్లో కొంతమార్పు కనిపిస్తోంది. రెవెన్యూ యంత్రాంగం పని ఒత్తిడిలో ఉన్నా.. వ్యవసాయ శాఖతో కలిసి ఉమ్మడి సర్వే చేయాలని ఆదేశించాం. నెలాఖరు నాటికి పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చాం.



 రైతు కార్డులు జారీ..



జిల్లాలో రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా జీపీఎస్ పరికరాలతో రైతుల భూముల వివరాలు సర్వే చేస్తున్నారు. ఈ సర్వేలో పూర్తిగా వాస్తవ సమాచారం వస్తుంది. దీంతో రైతువారీగా ఎంత భూమి ఉంది? దాని స్వభావం ఏమిటి? ఎంత భూమిలో సాగు చేస్తున్నారు? రైతు పట్టాదారా? కౌలుదారా? అనే విషయాలు సేకరిస్తారు. వాటి ఆధారంగా పూర్తి వివరాలతో రైతు కార్డులు జారీ చేస్తాం. బ్యాంకు రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ, ఎరువుల సరఫరా, పంట ఉత్పత్తుల అమ్మకం వంటి వాటిలో రైతు కార్డులనే పరిగణలోకి తీసకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. పాస్‌పుస్తకాల జారీ, మీసేవ పహాణీలు అప్‌డేట్ చేయడానికి కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి. ఈ విషయంలో హైదరాబాద్ వారితో మాట్లాడాను. అయినా కొంత సమయం పడుతుంది. ఈ లోపు కార్డులు జారీ చేస్తే ఇక వాటితో రైతులకు అంతగా పని ఉండదు.



 పహాణీలకు ఆధార్ లింకు..



 రైతుల భూమికి సంబంధించి.. మొత్తం భూమికి సర్వే నంబర్ల వారిగా రైతు ఆధార్ నంబర్‌ను జతచేసే ప్రక్రియ చేపడుతున్నాం. దీని వల్ల ఎవరికి వారు మార్పులు చేసే అవకాశం ఉండదు. ప్రసుత్తం భూ యజమానికి తెలియకుండానే వ్యక్తికి తెలియకుండానే పేర్లు.. చేతులు మారుతున్నాయి. ఆధార్‌తో ఇలాంటి వాటికి చెక్ పెట్టవచ్చు. ప్రస్తుతం ఈ పనులను జేసీ పర్యవేక్షిస్తున్నారు.

 ఇసుకతో ప్రతి కుటుంబం లబ్ధి పొందాలి



 ఇసుక తవ్వకాలు ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగానికి ఒక సవాల్ వంటిది. మన దగ్గర సుమారు మూడేళ్ల వరకు తవ్వుకునేంత ఇసుక నిల్వలు ఉన్నాయి. ఈ విషయంలో స్థానిక సొసైటీలకు ఇవ్వాలనేది ప్రభుత్వం విధానం. దాన్నే అమలు చేస్తున్నాం.

 ఇదే సమయంలో మధ్యవర్తులు, రాజకీయ ప్రమేయం వంటివి సహజంగానే ఉంటాయి. వాటిని పక్కన పెడితే స్థానికంగా గ్రామంలో సుమారు 550 వరకు కుటుంబాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.  ఈ కుటుంబాల వారి బ్యాంకు ఖాత నంబర్లు సేకరించి ప్రతి నెల వారీ వాటాగా వచ్చే డబ్బులను నేరుగా వ్యక్తిగత ఖాతాల్లో జమచేయాలని నిర్ణయించాం. ప్రతి కుటుంబానికి అన్ని ఖర్చులు పోను నెలకు కనీసం రూ.20 వేలకు తగ్గకుండా వారి ఖాతాల్లో జమ అవుతాయని అంచనా వేస్తున్నాం. ఈ విషయంలో మా ప్రణాళికలు క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు అధికారుల బృందం చర్యలు తీసుకుంటోంది. ఇలాంటి పద్ధ్దతినే గతంలో నేను జేసీగా ఉన్నప్పుడు మాసనపల్లిలో చేపట్టాం. అప్పుడు మంచి ఫలితాలు వచ్చాయి. రైతుల పొలాల్లో ఇసుక మేటలు తొలగించే విషయంలో ఏం చేయాలన్న విషయాన్ని పరిశీలిస్తున్నాం. త్వరలో దీనిపైనా నిర్ణయం తీసుకుంటాం.



 సీఎం హామీల విషయంలో..



 సీఎం జిల్లాకు వచ్చిన సమయంలో పేదలకు పలు హామీలు ఇచ్చారు. వాటి అమలు కోసం పనులు వేగంగా సాగుతున్నాయి. ఇదే అంశంపై ఇటీవలే గృహనిర్మాణ సంస్థ ఎండీ జిల్లాకు వచ్చారు. మురికివాడల్లో ఇళ్ల నిర్మాణ డిజైన్‌పై చర్చించాం. త్వరలో జిల్లాకు చీఫ్ ఇంనీర్ల బృందం వస్తుం ది. వారు జిల్లాలో నాలుగైదు రోజులు ఉండి అన్ని అంశాల ను వ్యహారాలను పరిశీలిస్తారు. నాలుగు ప్రాంతాల్లో స్థలం విషయంలో అభ్యంతరాలు లేవు. ప్రభుత్వం జీవోలు విడుదల చేసింది. ఆ ప్రాంతాలకు సంబంధించి నిర్మాణాల కో సం అధికారులు సమగ్ర ప్రణాళికలు(డీపీఆర్) సిద్ధం చేస్తా రు. ఆ వెంటనే పనులు ప్రారంభమవుతాయి. సర్వేలు, ఇళ్ల నిర్మాణం, ఇతర సమస్యలపై ప్రతివారం సమీక్షిస్తున్నాం.



 ‘పది’ ఫలితాలపై దృష్టి..



 విద్యా పరంగా పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు మంచి రి కార్డు ఉంది. ఈసారీ మంచి ఫలితాలు సాధించేందుకు ప దో తరగతి విద్యార్థులకు ముందు నుంచే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. పదో తరగతి ఫలితాల్లో ఈసారి జిల్లా మంచి స్థానంలో ఉండాలి. అందుకోసమే ఈ ప్రయత్నం.



గూగుల్‌లో భూముల సమాచారం



ప్రభుత్వ భూముల సమగ్ర సమాచారాన్ని ఫొటోలతో గూగుల్‌లో అందుబాటలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూముల గుర్తింపు కోసం ప్రత్యేకంగా స్టైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశాం. సర్వేయర్లు జీపీఎస్ ద్వారా సర్వేలు చేస్తారు. ప్రభుత్వ భూముల ఫొటోలు తీయించి   సమాచారం గూగుల్‌లో పెడతాం. దీంతో అక్రమణలు త్వరగా గుర్తించే అవకాశం ఉంది. ప్రభుత్వ భూములు గుర్తింపు పూర్తయ్యాక ప్రహరీల నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటాం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top